KCR SIT inquiry : ఫోన్ ట్యాప్ కేసులో ప్రత్యేక విచారణ బృందం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించింది. నంది నగర్ లోని ఆయన నివాసంలో ప్రత్యేక విచారణ బృందం విచారించింది. ఈ విచారణకు ముందు పార్టీలోని కొంతమంది కీలక నాయకులతో కెసిఆర్ సమావేశమయ్యారు. కీలక విషయాలను పంచుకున్నారు. అవి కాస్త ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
కెసిఆర్ నంది నగర్ లో నివాసం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి సమాలోచనలు చేసేవారు. అనేకమంది కవులు, కళాకారులు, మేధావులతో నిత్యం సంభాషణలు జరుపుతూ ఉండేవారు. కొన్ని సందర్భాలలో ఆయన రాత్రిపూట నిద్ర కూడా పోయేవారు కాదు. నంది నగర్ లోని నివాసంలో ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నిత్యం కార్యాచరణ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా సెకండ్ ఫ్లోర్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నిత్యం ఏదో ఒక రకమైన చర్చలు జరుగుతూ ఉండేవి.
అయితే ఇప్పుడు అదే సెకండ్ ఫ్లోర్లో కెసిఆర్ సిట్ బృందం విచారణకు హాజరు కావడం విశేషం. అయితే ఈ నివాసంలో తాను తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కార్యాచరణ చేపట్టారని.. ఎంతోమందితో సమావేశాలు నిర్వహించానని.. కానీ, ఇప్పుడు ఇదే భవనంలో విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఇబ్బందిగా ఉందంటూ పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. అలా మాట్లాడుకుంటూనే కెసిఆర్ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. మీడియాలో ఇదే అంశం విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.
మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయింది. ఈ విచారణలో కేసీఆర్ ను అధికారులు చాలా సేపు ప్రశ్నించారు. కెసిఆర్ ను విచారిస్తున్న క్రమంలోనే తెలంగాణ మొత్తం ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. అయితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ విచారణ జరుగుతున్నప్పుడు కూడా నంది నగర్ నివాసంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. సమీపంలో కూడా ఏ వాహనాలను రానివ్వలేదు. మొత్తానికి విచారణ పూర్తి కావడంతో అధికారులు వెళ్లిపోయారు. కెసిఆర్ కూడా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ నంది నగర్ నివాసంలోనే కెసిఆర్ విచారణ ఎదుర్కోవాల్సి రావడం ఒకరకంగా గులాబీ పార్టీకి షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని.. గులాబీ పార్టీని డిఫెన్స్ లో పడేసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును గులాబీ పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితి బలోపేతం కాకుండా ఉండడానికి రేవంత్ ఈ డ్రామాలు మొత్తం ఆడుతున్నారని.. ప్రజలు మొత్తం చూస్తున్నారని.. కచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తారని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు..