Homeజాతీయ వార్తలుCongress Politics: అక్కడా అదే సీన్.. టార్గెట్ రేవంత్ రెడ్డి..?

Congress Politics: అక్కడా అదే సీన్.. టార్గెట్ రేవంత్ రెడ్డి..?

Congress Politics: ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆటుపోట్లను ఎదుర్కొని పీసీసీ చీఫ్ అయిన రేవంత్ రెడ్డికి ఆ ప్రశాంతత లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఎంత ఉగ్గబట్టినా కూడా రేవంత్ రెడ్డికి ముందరి కాళ్లకు బంధాలు వేస్తూనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం ఇంకా వీడినట్లు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ ఓటమిపై ఒకరిపై ఒకరు ధూషణలు చేసుకోవడం మొదలు.. నిన్న అధిష్టానం వద్ద కూడా తప్పు తమదంటే తమది కాదని వాదిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ నాయకులంతా ఒక్కతాటిపై ఉండాల్సింది పోయి ఢిల్లీలోనూ అదే సీన్ కనిపించడంతో అధిష్టాన నాయకులు అవాక్కవుతున్నారు. దీంతో వీరి మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు ఢిల్లీ పెద్దలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హుజూరాబద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Revanth reddy12
Revanth reddy12

టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి అండ్ టీం పార్టీ కోసం తీవ్రంగానే కష్టపడుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్నినింపుతున్నారు. ఇక పార్టీకి ఎప్పటి నుంచో రిమార్క్ గా ఉన్న అసంతృప్తులకు బుజ్జగించేందుకు రేవంత్ రెడ్డి ఒక మొట్టు దిగి సీనియర్ల ఇంటి బాట పట్టారు. వారిని బుజ్జగిస్తూ అసమ్మతి లేకుండా చేశారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిరిజన దండోరా యాత్ర సభలు నిర్వహించారు. దాదాపు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించడంతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అందరూ ఆశించారు.

ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. వాస్తవానికి ఇక్కడ ఈటల వర్సస్ కేసీఆర్ ఎన్నిక అని చర్చించుకుంటున్నారు. దీంతో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నిక విషయంలో కాస్త తాత్సారం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న కౌశిక్ రెడ్డి ముందుగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి.. ఆ తరువాత పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు టికెట్ రాదని తెలియడంతో రేవంత్ రెడ్డిపై విమర్శలు మొదలు పెట్టారు. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం కష్టంగా మారింది. ముందుగా దామోదర నర్సింహ పేరు వినిపించగా ఆయన వెనకడుగు వేశారు. ఆ తరువాత పొన్నం ప్రభాకర్, స్థానిక నాయకుల పేర్లు పరిశీలించారు. చివరికి కొండా సురేఖకు ఖాయం అనే వార్తలు వచ్చాయి. అయితే తాను పోటీ చేయడానికి కొన్ని షరతులు పెట్టింది. దీంతో పార్టీ ఆ షరతుల విషయంలో ఎటూ తేల్చకపోవడంతో కొండా సురేఖ పోటీకి ఒప్పుకోనట్లు సమాచారం. చివరికి అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడం వరకు పరిస్థితి రావడంతో పార్టీలో అభ్యర్థి కరువు అన్న ప్రచారం జరిగింది. దీంతో టీపీసీసీ అప్రమత్తమై యువ నాయకుడు బల్మూరి వెంకటనర్సింహ ను బరిలోకి దించారు.

అప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి నాన్ లోకల్ అభ్యర్థి కావడంతో ఆయనను పరిచయం చేసేందుకే కొన్ని రోజులు పట్టింది. ఆ తరువాత రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అయితే గెలుపు విషయాన్ని పక్కనబెడితే పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికి కృషి చేసినట్లు సమాచారం.

కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ కు హుజూరాబాద్ ఎన్నికల్లో మూడువేల ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వచ్చిన పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో పార్టీలోని సీనియర్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం రోజే అసమ్మతిని తెలియజేశారు. అంతేకాకుండా కొందరు ఢిల్లీకి ఫిర్యాదు చేయడంతో ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింహా సహా రాష్ట్ర నాయకులు అధిష్టానాన్ని కలిసినట్లు సమాచారం. అయితే వార్ రూంలో కూర్చోబెట్టిన అధిష్టానం పార్టీ ఓటమిపై తీవ్రంగా చర్చించింది. ఇక్కడ కూడా నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular