**EDS: SCREENSHOT FROM A LIVESTREAM** Mumbai: Reserve Bank of India (RBI) governor Shaktikanta Das addresses via livestream as he announces the central bank’s monetary policy decisions, in Mumbai, Friday, Oct. 9, 2020. (PTI Photo)(PTI09-10-2020_000026B)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపోరేటు, 3.3 శాతం రివర్స్ రెపోరేటు వరుసగా ఐదోసారి యథాతథంగా కొనసాగనున్నాయి. 2021–22లో జీడీపీ వృద్ధి 10.5శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కమిటీ నిర్ణయాలను శక్తికాంతదాస్ బుధవారం ప్రకటించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం.. కొన్ని చోట్ల లాక్డౌన్ ఆంక్షల విధింపు నేపథ్యంలో ప్రస్తుతమున్న సర్దుబాటు విధాన వైఖరి కొనసాగింపునకే ఆర్బీఐ మొగ్గుచూపింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మొదటి ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఇది. ధరల స్థిరత్వం, వృద్ధి, ఆర్థిక స్థిరత్వం లాంటి అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. తాజాగా… మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు ఆర్థిక వృద్ధి పునరుత్తేజంలో అస్థిరతను పెంచాయని శక్తికాంత దాస్ తెలిపారు. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేస్తూ ఆర్థిక వ్యవస్థ రికవరీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మూడో త్రైమాసికం నాటికి అది 4.4 శాతానికి పరిమితం కావొచ్చని అభిప్రాయపడింది.
మరోవైపు.. ప్రభుత్వ రుణాలను క్రమబద్ధంగా నిర్వహించడానికి.. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. దేశీయ ఆర్థిక సంస్థలపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు ప్రభావాన్ని నిరోధించడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. 2021–-22లో తాజా రుణాల కోసం నాబార్డ్, ఎన్హెచ్బీ, ఎస్ఐడీబీఐకి రూ.50 వేల కోట్ల అదనపు లిక్విడిటీ సౌకర్యాన్ని ఆర్బీఐ ప్రకటించింది. అలాగే రాష్ట్రాలకిచ్చే స్థూల చేబదుళ్ల (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్) పరిమితిని రూ.47,010 కోట్లకు పెంచింది. ఇక కొవిడ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు మధ్యంతర రూ.51,560 కోట్ల చేబదుళ్ల కాలపరిమితిని సెప్టెంబరు వరకు పొడిగించింది.