ఏపీలో మంచి గ్రేస్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతున్నారు. 2007 నుంచి జగన్ మోహన్ రెడ్డితో ఆయనకు పరిచయం ఉంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ.. జగన్ మోహన్రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి నేటి వరకు ఆయన వెంట నడిచానన్నారు. వైఎస్ జగన్ పై ఉన్న నమ్మకంతో ఆయన వెంట ఉండిపోయామన్నారు.
అందుకే.. హుజూర్ నగర్లో తనను స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు. ఆ నమ్మకంతోనే వైఎస్ జగన్ తనను తెలంగాణ రాష్టానికి అధ్యక్షుడిగా నియమించారని శ్రీకాంత్ తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటివరకు నడుచుకున్నానన్నారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారన్నారు. అందుకే.. 151 ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీ స్థానాల్లో గెలిపించారన్నారు. తెలంగాణలో పోరాటాలు చేయలేదనే ఆరోపణలు వచ్చాయన్నారు. తెలంగాణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన గట్టు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అంటూ కొనియాడారు.
ఇవాళ తన జీవితంలో దుర్దినం అన్నారు గట్టు శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ జగన్ భవిష్యత్లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల ప్రకారం తాను జాతీయ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ పార్టీ నుంచే హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తానన్నారు. అదే సమయంలో షర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు. రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
భరోసా ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్టకు తప్ప మరే ఒక్క నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదన్నారు. ఓడపల్లి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. సాగర్లో డబ్బే గెలుస్తుంది. డబ్బు కావాలా? అభివృద్ధి కావాల్నో ప్రజలే తేల్చుకోవాలన్నారు.