Homeఅత్యంత ప్రజాదరణకేసీఆర్ సార్.. మీరు సాధించారు పో..!

కేసీఆర్ సార్.. మీరు సాధించారు పో..!

అరే..!  ప్రతిపక్షాలు వంద అంటారు భయ్..! కానీ ఫలితమొచ్చిందా లేదా? లక్షకోట్లు పోనీ భయ్..! ఒక్క రైతు ప్రాణమైనా బతికిందా లేదా..! తెలంగాణలో పైసలు పోయినా ప్రాణాలు నిలబడ్డాయని జాతీయ నేర గణాంకాల తాజా నివేదిక బయటపట్టింది. 
 
 ‘ఓ మొక్కకు అంటుకట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు..’ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ముందుకెళ్లారు. అదే ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. పంటను పండించింది. దానికి ఎంతో ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు విమర్శకులు దుమ్మెత్తి పోశారు కూడా. అయితేనేమీ.. రైతు పండింది. అతడు బతుకు మెరుగైందనడంలో ఎలాంటి సందేహం లేదు.  మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం..

ఒకప్పుడు ఆకలేస్తే ఆకాశం వైపు.. దాహం వేస్తే భూమివైపు చూసేంత కఠిన మెట్టప్రాంతం అదీ. వర్షాలు పడితేనే పంటలు పండేవి.. లేకపోతే ఆ ఏడు సాగు వదలుకోవాల్సిందే.. ఒక్క ప్రాజెక్టు లేదు.. ఒక్క కాలువ లేదు. వానలు పడకపోతే కరువు ప్రాంతాన్ని తలపిస్తుంటుంది. కానీ ముగ్గురు దీక్షా పరుల వల్ల ఇప్పుడు మెట్టప్రాంతం కాస్తా జలసిరితో కళకళలాడుతోంది. ఎండమావిలో నీటిజాడను తెప్పిస్తోంది.

సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్.. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లోని నియోజకవర్గాలివీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మెట్టప్రాంతంగా ఉన్న రాయలసీమలోని అనంతపురంను ఈ నియోజకవర్గాలు ఒకప్పుడు తలపించేవి. అలాంటి చోట సిద్దిపేటకు హరీష్, సిరిసిల్లకు కేటీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కావడంతోపాటు కేసీఆర్ కాళేశ్వరం సంకల్పం తెలంగాణ  దశనే మార్చేసింది.  ఇప్పుడు కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు సంతరించుకున్నాయి.

కరువుకు కేరాఫ్ అడ్రస్ గా సిరిసిల్ల, సిద్దిపేట, హుస్నాబాద్ లు ఉండేవి. ఇక్కడ సగటున ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలాలు 27 మీటర్ల లోతునకు చేరేవి. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జల మట్టం కేవలం 7-9మీటర్ల పైకి వచ్చాయి. ఇదంతా మిడ్ మానేరు ప్రాజెక్టు చలువే..

ఇక సిద్దిపేటలో నిర్మించిన రంగనాయకసాగర్ లోకి ఇప్పుడు కాళేశ్వరం గోదావరి జలాలు చేరాయి. మిడ్ మానేరు నుంచి అనంతసాగర్ మీదుగా సిద్దిపేటకు నీళ్లొచ్చాయి. మెట్టప్రాంతమైన సిద్దిపేట వాసుల కళ్లల్లో నిజంగా క‘న్నీళ్లు’ వచ్చాయి. కరువుసీమలో కాంతిరేఖను పంచాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా హుస్నాబాద్ కు గౌరవెల్లి సహా ఇతర ప్రాజెక్టులను నింపుతు అక్కడి నియోజకవర్గానికి నీరందిస్తున్నారు.

మొత్తంగా కరువుతో అల్లాడిన కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రాంతాలు ఇప్పుడు గోదారమ్మ చల్లని ఒడితో తనివితీర నీటి కరువు తీర్చుకుంటున్నాయి. ఆ జలాలు హైదరాబాద్ వరకు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మరలుతున్నాయి.  ఎక్కడి గోదారి ఎక్కడికి వచ్చిందని ప్రజల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. గోదారమ్మకు కేసీఆర్ లాగే చీరసారే పంచుతున్నారు. కరువునేలపై అంతటి నీటి జాడ చూసి జనం పులకించిపోతున్నారు.

 
ఎంతమంది విమర్శించినా.. ఎన్ని రాళ్లేసినా మానవ మనుగడ అన్నది నదులు, నీటి జాడల వద్దే మొదలైంది. ఆ నీటికోసమే యుద్ధాలు జరిగాయి. కాళేశ్వరం కోసం కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చుచేసినా ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. తెలంగాణలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రైతుబంధుతో అందరూ వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో భూమి బంగారమైంది. అందుకే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే తెలంగాణలో 45శాతం తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక బయటపెట్టింది. ఇంతకంటే ప్రజలకు ఏం కావాలి.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న కేసీఆర్ సంకల్పమూ నెరవేరింది. గత ఖరీఫ్ లో దేశంలోని మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ నుంచే 45శాతం వచ్చిందని మార్క్ ఫెడ్ తెలిపింది. తెలంగాణలో వరిసాగు మునుపెన్నుడూ లేనంతగా విపరీతంగా సాగయ్యింది. ఇది తెలంగాణ రైతుల ఘనతే కదా..  కేసీఆర్ ఖర్చు చేసినా.. ఫలితం మాత్రం వచ్చిందనడానికి ఇదే తార్కాణం..
 
-నరేష్ ఎన్నం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular