కరోనా మహమ్మారి మానవాళిని భయకంపితులను చేసింది. మొదటి దశ, రెండో దశలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. కొవిడ్ ప్రభావంతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. తిండిపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విటమిన్ సి ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ కరోనా బారి నుంచి రక్షణగా ఉండేందుకు చూస్తున్నారు. తినే తిండితోనే ఆరోగ్యం ముడి పడి ఉందని గ్రహించి ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో పెనుమార్పులు తెచ్చుకుంటున్నారు.
పోషకాల లోపం ఉంటే కరోనా త్వరగా సోకుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ విషయంలో పరిశోధనలు కూడా ఇదే విషయాలను ధ్రువీకరిస్తున్నాయి. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రసార మాధ్యమాలు సైతం తమ పాత్ర పోషిస్తున్నాయి. మనుషుల్లో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదనే హెచ్చరికల నేపథ్యంలో మూడో దశపై అందరిలో భయాందోళన నెలకొంది. తమ ప్రాణాల కోసం ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని చూస్తున్నారు.
పెద్దల కంటే పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపే కరోనా పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం గుర్తించాలి. పోషకాహార లోపం ఉన్న వారిలో కరోనా సోకే ప్రమాదం ఎక్కువ అని తెలుస్తోంది. చిన్నతనంలో పిల్లలు ఏదైనా సమయంలో పోషకాహార లోపం బారిన పడితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బాగా దెబ్బ తింటుంది. దీంతో కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
భారతదేశంలో పేదరికంతోనే పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. తినడానికి తిండి సైతం సరిగ్గా దొరకని సందర్భంలో పోషకాహారం ఎలా అందుతుంది. పోషకాహారం ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ అవి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పోషకాహార ప్రాధాన్యతను గుర్తించి ప్రజల బాగోగులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More