temple traditions : మనం దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుడి దర్శనం తరువాత చివరగా పూజారి వచ్చి తలపై ‘శఠగోపం’ పెడతారు. ఇది తరుచుగా.. ఎక్కువగా విష్ణు ఆలయాల్లో జరుగుతుంది. దేవుడి దర్శనం అయిన శఠగోపం తీసుకోకుండా ఇంటికి వెళ్లరు. దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం. అసలు శఠ అనగా.. గోపం .. అనగా అర్థం ఏంటీ?
శఠగోపం సాధారణంగా వెండి లేదా పంచలోహాలతో ఉంటుంది. చిన్న కిరీటంలా కనిపించే దీని పైభాగంలో శ్రీ మహావిష్ణువు పాదాల రూపం చెక్కి ఉంటుంది. స్వామి వారి పాదాలను ప్రత్యక్షంగా తలపై ధరించినట్లు గా భావించి అర్చకులు దీనిని భక్తుల శిరస్సుపై ఉంచుతారు. దీనివల్ల భక్తుడు దైవ అనుగ్రహాన్ని పొందుతాడని విశ్వాసం. శఠగోపాన్ని పూజరులు భక్తుల తలపై ఉంచుతారు. అంటే సాక్షాత్తూ స్వామి వారిని తాకిన చేతులతో శఠగోపాన్ని నెత్తిపై ఉంచుకోవడం వల్ల ఎంతో పుణ్యమని భావిస్తారు.
‘శఠ’ అనే పదానికి ప్రత్యేక అర్థం ఉంది. మోసం, అహంకారం, మనసులోని చెడు ఆలోచనలు అని అర్థం. ‘గోపం’ అనే పదానికి కాపాడటం, రక్షించడం అని అర్థం. అందువల్ల శఠగోపం అంటే మనలోని అహంకారాన్ని, చెడు గుణాలను అదుపులో ఉంచి దైవ మార్గంలో నడిపించే పవిత్ర సంకేతంగా భావిస్తారు. భగవంతుని సన్నిధిలో ఈ చెడు లక్షణాలను విడిచిపెట్టాలని ఈ ఆచారం సూచిస్తుందని పండితులు చెబుతారు. మరో అర్థంలో గర్భంలోని శిశువు శఠవాయువు నుంచి శఠగోపం రక్షిస్తుందని అంటారు. అంటే దేవుడి పాదాలు కలిగిన శఠగోపం తలపై ఉంచడంవల్ల మోక్ష మార్గం లభించి మరో జన్మ ఉండదని చెబుతారు.
వైష్ణవ సంప్రదాయంలో ఈ పవిత్ర వస్తువును శఠారి అని కూడా పిలుస్తారు. ఇది ప్రముఖ ఆళ్వార్ సంత్ నమ్మాళ్వార్తో అనుబంధం కలిగి ఉందని సంప్రదాయం చెబుతుంది. నమ్మాళ్వార్కు ‘శఠకోపుడు’ అనే బిరుదు ఉంది. ఆయన ద్వారా భగవంతుని కృప భక్తులకు లభిస్తుందనే విశ్వాసానికి ప్రతీకగా ఈ శఠారిని భక్తుల తలపై ఉంచే ఆచారం ఏర్పడిందని వైష్ణవ సంప్రదాయం వివరిస్తుంది.
శఠగోపం పెట్టించుకున్న తర్వాత చేతులు జోడించి స్వామివారిని స్మరించాలి. కొందరు శిరస్సును స్వల్పంగా వంచి నమస్కరిస్తారు. అనంతరం తీర్థం, ప్రసాదం స్వీకరించడం ఆనవాయితీ. ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచి దైవానుగ్రహం కోసం ప్రార్థించడం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తారు.