Radhakrishna vs YCP : వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మైక్ ముందుకు వచ్చి మాట్లాడేవారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే మీడియా మీద తీవ్రంగా విరుచుకుపడేవారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైవి సుబ్బారెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు మొత్తం బీభత్సంగా విమర్శలు చేసేవారు. కొన్ని సందర్భాలలో దాడులు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో ఏ మీడియా సంస్థ కూడా వ్యతిరేకంగా కథనాన్ని ప్రసారం చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడిదాకా ఎందుకు వైసీపీ అంటే విపరీతమైన ద్వేషంతో వ్యతిరేక కథనాలను ప్రసారం చేసే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నెగిటివ్ గా ఒక స్టోరీ కూడా ప్రజెంట్ చేయలేదు. పైగా నాడు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇచ్చేవారు. వార్షికోత్సవం సందర్భంగా వైసీపీ నేతలు కూడా జాకెట్ యాడ్స్ ఇచ్చేవారు. అప్పట్లో ఈ పరిణామం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించేది.
రాష్ట్రస్థాయిలో జగన్ మీద తీవ్ర వ్యతిరేక భావజాలాన్ని ఆంధ్రజ్యోతి ప్రదర్శించేది. వై వి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయేది. వేమూరి రాధాకృష్ణతో పై ముగ్గురు నేతలు ఏమైనా లాలూచీపడ్డారా.. ఎందుకు రాధాకృష్ణకు వీరి మీద అంత ప్రేమ.. అని అప్పట్లో చర్చ జరిగేది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పై ముగ్గురు నేతలు మీడియాలో విపరీతంగా కనిపించేవారు. ఒకరకంగా జగన్ తర్వాత తామే అన్నట్టుగా ప్రచారం చేసుకునేవారు. కొన్ని సందర్భాలలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా బీట్ చేసేవారు. అప్పట్లో అధికారం ఉంది కాబట్టి వీరి ముగ్గురికి మీడియా విపరీతమైన హైప్ ఇచ్చేది.
ఇటీవల జగన్ మావిగన్ అనే పేరుతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానిని వేమూరి రాధాకృష్ణ తన పత్రికలో ఖండించారు. రాయడానికి వీలు లేని భాషలో విమర్శించారు. ఇది సహజంగానే వైసీపీ నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది. ఇంకేముంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేయడానికి వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పేర్ని నాని.. అంబటి రాంబాబు.. వంటి కాపు నేతలు మాత్రమే తెరపైకి వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వై వి సుబ్బారెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. కనీసం ఖండించలేదు. ఈ పరిణామాలు చూస్తుంటే ఆ రాధాకృష్ణ మీదికి వ్యతిరేకంగా కేవలం కాపు నేతలను మాత్రమే పంపిస్తున్నట్టు అర్థమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం సాగించి.. భారీగా దండుకున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
ఈ పరిణామాన్ని వైసీపీ నేతలు మరో విధంగా చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదని.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాపు నేతలను బలి పశువులు చేస్తున్నారని వైసీపీలోని కాపు నేతలు అంటున్నారు.. లేని జగడాన్ని సృష్టించి.. కాపు వర్సెస్ వేమూరి రాధాకృష్ణ అన్నట్టుగా పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పేర్ని నాని మీద.. ఆయన కుమారుడు పేర్ని కిట్టు మీద కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు మీద కూడా కేసు నమోదు కావడం.. ఆయన జైలుకు వెళ్లడం కూడా జరిగిపోయాయి.. కాకపోతే కాపు నేతలు జైలుకు వెళ్ళినప్పుడు జగన్ సొంత మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు.. కానీ రెడ్డి సామాజిక వర్గ నేతలు పొరపాటున జైలుకు వెళ్తే మాత్రం విపరీతమైన ప్రచారం చేస్తోంది. ఆందోళనలు.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే విషయంలో కాపు నేతలు ముందు వరుసలో ఉంటున్నారు. చివరికి వివాదాలలో కూడా వారే కనిపిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇదేదో మేం చేస్తున్న ఆరోపణ కాదు. కావాలని అంటున్న మాట అంతకంటే కాదు. కొంతకాలంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతోంది.
వేమూరి రాధాకృష్ణ విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వై వి సుబ్బారెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. వీరికి ఏమైనా రాధాకృష్ణతో సంబంధాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ తరఫున వారు కనిపించకపోవడం.. గొడవలు జరుగుతున్నా సరే పట్టించుకోకపోవడం.. అనేక అనుమానాలకు కారణమవుతోంది.. మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారు.. వైసిపి కార్యకర్తల్లో బలపడుతున్న అనుమానాలను ఎలా నివృత్తి చేస్తారు… అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.