చిన్నప్పుడు చదువుకున్న కథ. ఓ పడవలో కొందరు ప్రయాణిస్తున్నారు. ఓ వ్యక్తి తనతోపాటు మూడు డబ్బాలను పడవలోకి తెచ్చాడు. ఆ మూడిట్లో కప్పలు ఉన్నాయి. అయితే.. రెండు డబ్బాలకు మూతలు పెట్టి ఉన్నాయి. ఒక డబ్బాకు మాత్రం మూత పెట్టలేదు. ఎందుకిలా అని అడితే.. మొదటి డబ్బా మూత తెరిచి చూపించాడు సదరు వ్యక్తి. అందులోని ఒక్కో కప్ప ఎగిరి బయట నీళ్లలో పడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే మూత పెట్టానని చెప్పాడు. మరో డబ్బాలోనూ ఇదే పరిస్థితి. అయితే.. అవి కలిసికట్టుగా డబ్బాలోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కో కప్ప, మరో కప్పను పైకి నెడుతున్నాయి. అందుకే దీనికీ మూత పెట్టానని చెప్పాడు. మరి, మూడో డబ్బాకు ఎందుకు పెట్టలేదని అడిగితే.. నువ్వే వెళ్లి చూడు అన్నాడు.
అతను వెళ్లి చూస్తే.. పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న కప్పను మరో కప్ప కిందకు లాగుతోంది. ఆ కప్పను మరో కప్ప కిందకు లాగుతోంది. అలా.. అవి కిందపడుతున్నాయి. మళ్లీ లేస్తున్నాయి. వాటి వ్యవహారం ఎప్పటికీ ఇంతే కాబట్టి మూత పెట్టాల్సిన వసరం లేదన్నాడా వ్యక్తి. ఈ కథ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు జనాలు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ప్రజలకు చెప్పుకోలేక ఓడిపోయారు. టీఆర్ఎస్ ప్రజలకు ఏమీ చేయలేదన్న విషయం చెప్పుకోలేక మరోసారి ఓడిపోయారు. ఈ క్రమంలోనే కొందరు కారెక్కేశారు. కేడర్లో జోష్ లేదు.. పార్టీ బాగుపడుతుందన్న ఆశా లేదు. ఇలాంటి సమయంలో కూడా కీచులాడుకోవడం పక్కన పెట్టట్లేదు హస్తం నేతలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు ఎత్తేయడంతో.. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయంలో మూడో డబ్బాలోని కప్పల మాదిరిగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ వచ్చిన కానుంచి ఇప్పటి వరకు అధికార పార్టీని నేరుగా ఎదుర్కొన్న నేత కాంగ్రెస్ లో లేడన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయమే. అందుకే.. పీసీసీ చీఫ్ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. అంతేకాదు.. అది బలంగా కూడా ఉంది. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం రేవంత్ వల్లనే అవుతుందన్నది శ్రేణుల నమ్మకం. కానీ.. దీనికి మోకాలడ్డుతున్నారు సీనియర్లు.
బయట పార్టీ నుంచి వచ్చిన ఆయనకు ఎలా ఇస్తారన్నది వాళ్ల కొచ్చెను. పార్టీలో సీనియర్లము లేమా? అన్నది మరో కొచ్చెను. మరి, ఇన్నాళ్లు ఏం చేశారు? అన్నదానికి సమాధానం ఉండదు. పీసీసీ కిరీటం మాత్రం మాకే కావాలే. ఏం చేయలేకపోయినా.. అది పెట్టుకొని గాంధీ భవన్లో కూర్చోవాలె అన్న పద్ధతిలోనే సీనియర్లు వ్యవహరిస్తున్నారని సాక్షాత్తూ ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా విమర్శిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా.. కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఆ ఎన్నిక, ఈ ఎన్నిక అంటూ అధ్యక్ష నియామకం దాటేస్తోంది. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక కూడా ముగిసింది. మరి, ఇకనైనా పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారా? కాంగ్రెస్ పుట్టి పూర్తిగా మునిగిపోయేదాకా వెయిట్ చేస్తారా? అన్నది చూడాలి.