Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ముందుగానే అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము అదే నియోజకవర్గంలో పోటీ చేస్తామని.. తమకే టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల ముందు గట్టిగానే ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో టిడిపి నుంచి పోటీ చేశారు. చాలా కాలం పాటు టిడిపిలో కొనసాగారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీద భారీ అంతరంతో గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించారు.
పరకాల నియోజకవర్గానికి కొండ సురేఖ కుటుంబానికి దగ్గర సంబంధం ఉంటుంది. గతంలో ఈమె శాయంపేట ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పరకాలలో బలమైన సంబంధాలు ఏర్పరుచుకున్నారు. కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ రావుకు పరకాలలో బంధువులు.. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉన్నారు. కొండ మురళి.. కొండా సురేఖ దంపతులకు ఒకే ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు కొండ సుస్మితా పటేల్.
సరిగ్గా గత ఏడాది కొండా సురేఖ వద్ద పనిచేసే వ్యక్తిగత కార్యదర్శి వ్యవహారంలో కొండా సుస్మిత తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రిని లక్ష్యంగా చేసుకొని ఆమె విమర్శలు చేశారు. అప్పట్లో ఆమె సృష్టించిన అలజడి తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. వైద్య విద్యను అభ్యసించిన సుస్మిత వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని ఇటీవల ఆమె తండ్రి మురళి ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే సుస్మిత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరకాల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు.. ఇతర వ్యవహారాలు సాగిస్తున్నారు.
ఆదివారం పరకాల ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారని.. 2023 మాదిరిగానే ఆయనకు పరకాల ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దీంతో ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కలకలం రేగింది. సుస్మిత పరకాల నుంచి పోటీ చేస్తారని ఆమె తండ్రి చెబితే.. వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డికే మళ్ళీ ఇస్తామని టికెట్ కేటా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా మంత్రి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిందని తెలుస్తోంది. అప్పట్లో సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.