Bandi Sanjay On AP: తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏపీ పై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించిన ఆయనను హై కమాండ్ పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ శ్రేణులనుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఏపీ బాధ్యతలు ఆయనకు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శులకు ఏదో ఒక రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం బిజెపిలో ఆనవాయితీగా వస్తోంది.
ఏపీ బిజెపి ఇన్చార్జిగా కేరళకు చెందిన కేంద్రమంత్రి మురళీధరన్ బాధ్యతలు చేపడుతున్నారు. సహ ఇన్చార్జిగా సునీల్ దియోధర్ ఉండేవారు. అయితే ఇటీవల ప్రకటించిన కార్యవర్గంలో సునీల్ దియేధర్ ను తప్పించారు. అటు మురళీధరన్ సైతం తనకు ఏపీ ఇన్చార్జి బాధ్యతలు నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్న బండి సంజయ్ ను ఏపీకి నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే సంజయ్ ఏపీ ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
తాజాగా ఓటర్ చేతన్ మహావియన్ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. బిజెపి క్రియాశీలక నాయకులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి వర్చువల్ విధానంలో బండి సంజయ్ మాట్లాడారు. ఏపీలో జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. వైసిపి మరోసారి గెలిచే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పదివేలకు పైగా నకిలీ ఓట్లను చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ విషయంపై సీరియస్ గా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం జడ్పీ సీఈఓ ను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి విక్రయాలు,ఇసుక దందా, భూకబ్జాలు ఏపీలో పెరుగుతున్నాయని ఆరోపించారు. అటు జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తారు. అదే దూకుడు తనం ఏపీలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని హై కమాండ్ భావిస్తోంది. అందుకే బండి సంజయ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జనసేనతో పొత్తులు, వైసీపీ సర్కార్ పై దూకుడు కెళ్లే క్రమంలో సంజయ్ అయితేనే సరైన నేత అని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ను ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఏపీ బీజేపీ ఇన్చార్జిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.