Mood of the Nation Survey : వాస్తవానికి ఇప్పట్లో కేంద్రస్థాయిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ.. భాగస్వామ్య పార్టీలతో ఎటువంటి లుకలుకలు లేకుండా చూసుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. టిడిపి తో.. అటు నితీష్ కుమార్ పార్టీతో.. ఏకకాలంలో ఉభయ కుశలోపరి అనే పాత్రను నరేంద్ర మోడీ పోషిస్తున్నారు.
ఇటీవల కాలంలో నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ పురుడు పోసుకుంది. ఏకంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇవి కాస్త సంచలనంగా మారాయి. ఒకరకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు జెన్ జెడ్ ను సంతృప్తి పరచడానికి నరేంద్ర మోడీ ఏకంగా ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలు చేయాల్సి వస్తోంది. ఈ పరిణామాలు కేంద్రంలో బిజెపి స్థాయిని తగ్గిస్తున్నాయా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా. కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం సృష్టిస్తుందా.. ఇలా అనేక అంశాల ఆధారంగా మూడ్ ఆఫ్ దినేషన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి.
ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల జరిగితే బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 326 సీట్లతో అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమికి 185 సీట్లు లభిస్తాయని సమాచారం. ధరల స్థాయి పెరగడం.. నిరుద్యోగం.. ఇంకా అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. అయినప్పటికీ జెన్ జెడ్.. మిగతా వర్గాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. ఆయన ఆధ్వర్యంలోనే దేశం బలోపేతం అవుతుందని భావిస్తున్నాయి.
ఈ సర్వేలో అనేక ప్రశ్నలను సంధించారు. ప్రధానంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి 67 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యవస్థ మీద నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు. మిగతా 14 శాతం మంది పరీక్షలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని 17 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో రిగ్గింగ్.. అవినీతిని అరికట్టే విషయంలో కేంద్రం విఫలమవుతుందని మెజారిటీ యువత అభిప్రాయపడ్డారు. గతంలో ఈ సంఖ్య కొంత మాత్రమే ఉండగా.. ఇప్పుడు చాలామంది యువత జవాబుదారితనాన్ని కోరుకుంటుండడం విశేషం. మరోవైపు ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మీద ఆందోళనలు నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీకి ఓటు వేస్తారని ప్రశ్నిస్తే.. చాలామంది వేయబోమని చెప్పారు. అది కేవలం ప్రశ్నించే గొంతు లాగా మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.