హుజురాబాద్ ఉప ఎన్నికపైనే రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. విజయమే లక్ష్యంగా తమ ప్రచారాలు ఉండేలా ప్రణాళిక రచించుకుంటున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ దళిత బంధు పేరుతో కొత్త ప్రాజెక్టు కోసం శ్రీకారం చుట్టింది. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించలేదు. ఈటలను ఎదుర్కొనే దీటైన అభ్యర్థి కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల ప్రభావం హుజురాబాద్ పై పూర్తిస్థాయిలో పడుతోంది.
టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఇతర అంశాలు ఉన్నా ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నిక గురించే చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి, ప్రచారం, పథకాల గురించి ఎలా వివరించాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రజల్లోక వెళ్లి వారిని ఆకట్టుకోవడం కోసం ఏం చేయాలనే విషయాలపై ఫోకస్ చేయనున్నారు.
రాష్ర్టంలోని రాజకీయ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ చర్చించే అవకాశం ఉంది. పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణాలపై కూడా చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం గురించి కూడా డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు చేపట్టే కార్యక్రమాలపై సలహాలు, సూచనలు చేస్తారు. తరువాత కార్యక్రమాల వివరాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మిగతా అంశాలు ఎలా ఉన్నా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ప్రధాన చర్చ సాగనున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నికలో పార్టీ విజయ తీరాలకు చేర్చే బాధ్యత కార్యకర్తలు తమ భుజాలపై వేసుకోవాల్సిన అవసరం గురించి చర్చిస్తారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ తన శక్తియుక్తులను పణంగా పెట్టి విజయం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More