
విశాఖ స్టీల్ ప్లాంటు విషయాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుగుణంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కనపెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఉమ్మడిగా పోరాడి ఆంధ్రుల హక్కులను కాపాడాల్సిన రెండు ప్రధాన పార్టీలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. తాజాగా.. సీఎం జగన్.. చంద్రబాబు నాయుడు మోదీకి రాసిన లేఖల విషయంలో రంధ్రాన్వేషణ బయటపడింది. అయితే.. ఇద్దరూ లేఖలు రాశారని.. చంద్రబాబు రెండు లేఖలు రాశారని పీఎంవో తెల్చింది.
స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ నిర్ణయం తరువాత సీఎం జగన్ సైలెంటుగా ఉన్నారని ఆయన స్పందించాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. అయితే దానిపై ప్రధాని స్పందించలేదు. దీంతో సీఎం జగన్ లేఖ రాయలేదని, ఊరికే రాశారని ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రివర్స్ లో వైసీపీ నేతలు చంద్రబాబు ఆ లేఖ కూడా రాయలేదని విమర్శలు చేస్తున్నారు. చివరికి చంద్రబాబు వేర్వేరు సందర్భాల్లో రెండు లేఖలు రాశారు. అయితే ఆయన రాయలేదని.. ఉత్తుత్తినే రాసినట్లు చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. అలా ఎవరు లేఖలు రాయలేదో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో నేరుగా సహ చట్టం కింద కొంతమంది పీఎంవోకు దరఖాస్తు చేశారు.
అయితే ఇద్దరూ లేఖలు రాశారని.. పీఎంవో స్పష్టం చేసింది. వాటిని సంబంధిత శాఖకు పంపించామని వారు సమాధానం ఇచ్చారు. ఇక్కడ సమస్యల వారు లేఖలు రాయడమే. టీడీపీ, వైసీపీ ఇలా ఎవరికి వారు ప్రత్యర్థులపై బురదజల్లేందుకు సమయం కేటాయించారు. కానీ.. సమైఖ్యంగా పోరాడి.. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణను అడ్డుకుందామనే ప్రయత్నాలు వారు చేయలేదు. పార్లమెంటులోనూ ఎవరికివారే మాట్లాడుతున్నారు. దీంతో కేంద్రం లైట్ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో సమస్యలు వచ్చినప్పుడు అక్కడి ఎంపీలు పార్టీలకు అతీతంగా సభను స్తంభించేవారు. సమస్య తీవ్రతను తెలిపేవారు. కానీ ఇప్పుడు ఏపీ ఎంపీల్లో ఆ స్ఫూర్తి కొరవడింది.
గతంలో ప్రత్యేక హోదాకోసం… రెండు పార్టీల ఎంపీలు విడివిడిగా అయినా సభను స్తంభింపజేసేవారు. స్టీల్ ప్లాంటు ఉద్యమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేయడంలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే.. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ అన్నది సాధ్యం కాదని అందరూ చెబుతున్నమాట. స్టీల్ ప్లాంటులో వందశాతం వాటాలు కేంద్ర ప్రభుత్వానికి ఉండొచ్చు. కానీ… ఆ ప్లాంటు ఏపీలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగితే పోస్కో ఏపీ వైపు చూస్తోంది. తాము సిద్ధంగా లేమని ఏపీ సర్కారు ఒక్కమాట చెబితే.. ప్రయివేటీకరణ ఆగిపోతుంది. కానీ ఏపీ సర్కారు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.