ఎమ్మెల్యే అంటే ఐదేళ్ల వరకూ నియోజకవర్గంలో కింగ్. ఇక, అధికార పార్టీలో ఉంటే.. ఇక, ఆ రేంజ్ చెప్పాల్సిన పనిలేదు. కానీ.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నాడట. దీనికి కారణం గ్రూపుల గొడవలేనట! ఒకటీ రెండు కాదు.. ఏకంగా తన నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉండడంతో.. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక తల పట్టుకుంటున్నారట!
ఆయన మరెవరో కాదు గిద్దలూరు వైసీపీ శాసనసభ్యుడు అన్నా రాంబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ (81,035)తో విజయం సాధించిన ఎమ్మెల్యే ఆయన. కానీ ఏం లాభం..? గ్రూపు గొడవలతో ఆయన సతమతం అయిపోతున్నారు. ఇక్కడ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఈ నియోజకవర్గంలో ముత్తముల అశోక్ రెడ్డి గతంలో పార్టీని వీడారు. అయితే.. బాలినేని ప్రయత్నంతో ఆయన క్యాడర్ మళ్లీ తిరిగి వచ్చిందట. ముత్తముల కూడా తిరిగి ఫ్యాన్ గాలి కింద సేదతీరుదామని అనుకున్నప్పటికీ.. జగన్ అంగీకరించలేదని సమాచారం. ఇక, అన్నా రాంబాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వస్తున్నప్పుడు తన వర్గాన్ని కూడా వెంట తెచ్చుకోవడం అనేది కామనే.
ఈ రెండూ కాకుండా మూడో వర్గం కూడా ఇక్కడ ఉంది. అది వైసీపీ వర్గం. అంటే.. పార్టీ ఎవరిని నిలబెట్టినా.. వారి కోసం పార్టీ కోసం పనిచేసే వర్గం అన్నమాట. ఇంకా చెప్పాలంటే.. ముందు నుంచీ పార్టీలో ఉన్నవర్గం. ఇప్పుడు ఈ మూడు గ్రూపులను మేనేజ్ చేయలేక రాంబాబు ముప్పు తిప్పలు పడుతున్నారట!
తాను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి.. తన వర్గానికి పనులు చేసి పెట్టడం అన్నది ఎమ్మెల్యేకు కంపల్సరీ. కానీ.. మంత్రి బాలినేని అండతో ముత్తముల వర్గం ఫుల్ యాక్టివ్ గా ఉందట. తమకు పనులు చేసిపెట్టకుంటే.. కంప్లైంట్లు వెళ్తున్నాయట. ఈ రెండు గ్రూపుల పరిస్థితి ఇలాఉంటే.. మూడో గ్రూపు కూడా గుర్రుగా ఉంటోందట.
తాము మొదట్నుంచీ పార్టీలో ఉన్నప్పటికీ.. తమకు ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వట్లేదని గుస్సా అవుతోందట. ఇలా.. మూడు గ్రూపుల నుంచి అలకలు, ఆవేశాలూ వ్యక్తమవుతుండడంతో.. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో.. సమన్యాయం ఎలా చేయాలో తెలియట్లేదట రాంబాబుకు! మరి, వచ్చే ఎన్నికల నాటికి ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.