Homeఅంతర్జాతీయంకరోనాతో ఒలింపిక్స్‌‌ వాయిదాకు పెరుగుతున్న వత్తిడి

కరోనాతో ఒలింపిక్స్‌‌ వాయిదాకు పెరుగుతున్న వత్తిడి

ఒలింపిక్స్‌‌కు సంబంధించి రోజుకో కీలక ఘట్టం జరుగుతున్నా… క్రీడల నిర్వహణపై సందేహాలు మాత్రం తగ్గడం లేదు. ఏదో ఓ దశలో క్రీడలు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా దృష్ట్యా క్రీడలను వాయిదా వేయాలని వత్తిడులు పెరుగుతున్నా జపాన్ మాత్రం ఉలకడం లేదు. గురువారం నుంచి జరిగే టార్చ్‌‌ రిలేను జపాన్‌‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏథెన్స్‌‌ నుంచి శుక్రవారం ఇక్కడికి చేరుకున్న టార్చ్‌‌ను చూడటానికి జనాలు ఎగబడుతున్నారు.

జపాన్‌‌ ఉత్తర భూభాగంలోని ఫకుషిమాలో ప్రారంభమయ్యే ఈ రిలే కోసం అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 2011లో వచ్చిన సునామీ, భూకంపాలకు తోడుగా న్యూక్లియర్‌‌ రియాక్టర్ల పేలుడుతో ఫకుషిమా ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. చాలా కాలం కనీస వసతులు లేక జనసంచారం కూడా బాగా తగ్గింది.

ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకుని జీవనం మొదలుపెట్టారు. అలాంటి ప్రాంతంలో రిలేను నిర్వహించడం ద్వారా ఫకుషిమా కోలుకుందని ప్రపంచానికి చాటి చెప్పాలని జపాన్‌‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక్కడ జరిగే టార్చ్‌‌ రిలే ద్వారా స్పాన్సర్లకు కూడా భారీ ఆదాయం సమకూరనుండటంతో క్రీడలకు ఢోకా లేదనే ప్రచారం కూడా మొదలైంది.

మే 18, 19 తేదీల్లో హిరోషిమాలో రిలే జరుగుతుంది. ఇంత పకడ్బందీగా రిలే మొదలుపెడుతున్నా… ఓ సర్వేలో 69.9 శాతం మంది జపాన్‌‌ ప్రజలు మాత్రం షెడ్యూల్‌‌ ప్రకారం క్రీడలు జరగవని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రీడలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

క్వాలిఫికేషన్‌‌ ఈవెంట్స్‌‌ నిలిచిపోవడంతో చాలా మంది అథ్లెట్లు గేమ్స్‌‌ను వాయిదా చేయాలని కోరుకుంటున్నారు. చాలా ఇంటర్నేషనల్‌‌ అసోసియేషన్లు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. కొలంబియా, స్లోవేనియా, నార్వే, అమెరికా స్విమ్మింగ్‌‌, ఫ్రెంచ్‌‌ స్విమ్మింగ్‌‌ అసోసియేషన్లు.. క్రీడలను వాయిదా వేయాలని డిమాండ్‌‌ చేస్తున్నాయి.

కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ కాకపోతే దాదాపు 11 వేల మంది అథ్లెట్లను గేమ్స్‌‌ విలేజ్‌‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్ల వైరస్‌‌ పెరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీడలను వాయిదా వేయడం మంచిదని నార్వే ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌ చేసిన విజ్ఞప్తిపై టోక్యో గేమ్స్‌‌ ఆర్గనైజింగ్‌‌ కమిటీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ తొషియాకి ఎండో వాయిదా గురించి మాట్లాడకుండా అనుకున్న షెడ్యూల్‌‌ ప్రకారమే గేమ్స్‌‌ జరుగుతాయని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది పాటు వాయిదా వేయాలని యూఎస్‌‌ అసోసియేషన్‌‌ కోరుతోంది.

ఇంకా నాలుగు నెలల సమయం ఉందని చెబుతున్న నిర్వాహకులు ఇప్పుడే వాయిదా నిర్ణయం ప్రకటించడం తొందరపాటే అవుతుందని చెబుతున్నారు. 1.43 బిలియన్‌‌ డాలర్లతో నిర్వహించిన టోక్యో సెంటర్‌‌ స్టేడియంలో అట్టహాసంగా క్రీడలను మొదలుపెట్టాలని భావిస్తున్నా.. అది జరిగేలా కనబడటం లేదు.

క్రీడల వాయిదాకు వస్తున్న వత్తిడులను ఐఓసీ ప్రెసిడెంట్‌‌ థామస్‌‌ బాచ్‌‌ మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. క్రీడలను రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టం చేస్తున్నారు. దానితో ఐఓసీ తీరుపై సంఘంలోని సభ్యులే విమర్శలు చేస్తున్నారు.

మానవత్వం లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఐఓసీ సభ్యురాలు కెనడాకు చెందిన హాలే విక్‌‌నైసర్‌‌ విమర్శించింది. ఇక అథ్లెట్ల ప్రాణాలతో అంతర్జాతీయ బాడీ ఆటలాడుతోందని జపాన్ ఒలింపిక్‌‌ కమిటీ సభ్యుడు కొరీ యమగుచి మండిపడ్డారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular