Homeఅంతర్జాతీయంJapan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ...

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా అమెరికా ప్రపంచ పెద్దన్నగా నిర్దేశిస్తోంది. కానీ అసలు అణు టెక్నాలజీ అమెరికా కూడా దొంగతనంగా పొందినదే. ఈ విషయం చాలా మందికి తెలియదు. జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించి రూపొందించిన టెక్నాలజీని సొంతం చేసుకుని ఇప్పుడు ప్రపంచ పెద్దన్నగా ఎదిగింది. ఇదే టెక్నాలజీ జపాన్‌ […]

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా అమెరికా ప్రపంచ పెద్దన్నగా నిర్దేశిస్తోంది. కానీ అసలు అణు టెక్నాలజీ అమెరికా కూడా దొంగతనంగా పొందినదే. ఈ విషయం చాలా మందికి తెలియదు. జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించి రూపొందించిన టెక్నాలజీని సొంతం చేసుకుని ఇప్పుడు ప్రపంచ పెద్దన్నగా ఎదిగింది. ఇదే టెక్నాలజీ జపాన్‌ చేరి ఉంటే.. ప్రపంచం నేడు మరోలా ఉండేది. అమెరికా పెద్దన్నగా చెలామని అయ్యేది కాదు. జపాన్‌ అణుదాడికి గురయ్యేది కాదు.

అణు విచ్ఛిత్తి ఆవిష్కరణ..
1938లో ఇద్దరు శాస్త్రవేత్తలు యురేనియం పరమాణువును విడగొట్టే ప్రయోగం విజయవంతం చేశారు. అందులో నుంచి విడుదలైన అత్యంత బలమైన శక్తి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. శాస్త్రవేత్తలు లెక్కలు వేసి గుర్తించారు: ఈ శక్తిని నియంత్రిస్తే విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యం, నియంత్రించకుండా వదిలేస్తే భయంకరమైన విస్ఫోటనం సృష్టించవచ్చు. అని గుర్తించారు. హిట్లర్‌ పాలనలో అనేకమంది శాస్త్రవేత్తలు జర్మనీని వదిలి పారిపోయారు. లియో స్జిలార్డ్‌ వంటి తెలివైన శాస్త్రవేత్తలు పరిశోధన వివరాలను రహస్యంగా ఉంచాలని, హిట్లర్‌కు తెలిస్తే బాంబు తయారు చేస్తాడని హెచ్చరించారు. యురేనియం రియాక్షన్‌పై పేటెంట్‌ తీసుకుని, పరిశోధన పత్రాలు ప్రచురించవద్దని సలహా ఇచ్చారు. అయితే మేరీ క్యూరీ అల్లుడైన శాస్త్రవేత్త చైన్‌ రియాక్షన్‌తో బాంబు సాధ్యమని తన పరిశోధనలో ప్రచురించడం ద్వారా ఈ సమాచారం జర్మన్‌ కెమిస్టుల దృష్టికి వచ్చింది. నాజీలు గుర్తించారు. దీన్ని ముందుగా తయారు చేసినవారు ప్రపంచాన్ని ఓడించలేని శక్తిని సొంతం చేసుకుంటారని భావించారు. 1939 సెప్టెంబర్‌ 1న పోలాండ్‌పై దాడితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జర్మన్‌ మిలటరీ వెంటనే టాప్‌ శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి రహస్య ప్రాజెక్టును ప్రారంభించింది.

జర్మన్‌ రహస్య ప్రాజెక్టు..
వెర్నర్‌ హైజెన్‌బర్గ్‌ నాయకత్వంలో ఏర్పడిన బృందం సైన్యానికి స్పష్టంగా చెప్పింది బాంబు సాధ్యమే, కానీ యురేనియం–235 లేదా ప్లుటోనియం అవసరం. యురేనియం–235 ప్రకృతిలో అరుదు. ప్లుటోనియం ప్రకృతిలో దొరకదు, దాన్ని న్యూక్లియర్‌ రియాక్టర్‌లో తయారు చేయాలి. రియాక్టర్‌ నడపడానికి యురేనియం ఆక్సైడ్‌తో పాటు మోడరేటర్‌ అవసరం. మోడరేటర్‌ అంటే యురేనియం విడిపోతున్నప్పుడు వేగంగా ప్రయాణించే న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించేది. వేగం తగ్గకపోతే విస్ఫోటనం జరగదు. హైజెన్‌బర్గ్‌ మూడు ఎంపికలు సూచించాడు: సాధారణ నీరు, గ్రాఫైట్, హెవీ వాటర్‌. సాధారణ నీరు విఫలమైంది. వాల్టర్‌ బోతే (జర్మనీలో ప్రముఖ న్యూక్లియర్‌ కెమిస్ట్‌) గ్రాఫైట్, హెవీ వాటర్‌పై పరీక్షలు నిర్వహించాడు. గ్రాఫైట్‌ పనికిరాదని తేల్చాడు. ఇది జర్మనీ చేసిన పెద్ద తప్పు. గ్రాఫైట్‌ అపరిశుద్ధంగా ఉండటం వల్ల ప్రయోగం విఫలమైంది. హెవీ వాటర్‌ తయారీ టెక్నాలజీ జర్మనీ వద్ద లేకపోవడంతో సమస్య తీవ్రమైంది. లక్షల లీటర్ల నీటిని వేడి చేయడానికి భారీ విద్యుత్‌ అవసరం. జర్మనీలోని విద్యుత్‌ కేంద్రాలు యుద్ధ ఆయుధాల ఉత్పత్తికి మళ్లించబడుతున్నాయి. కాబట్టి పొరుగున ఉన్న నార్వే పర్వతాల్లోని ప్లాంట్‌పై దష్టి పెట్టారు. అక్కడ ఇప్పటికే డ్రమ్ముల్లో హెవీ వాటర్‌ నిల్వ ఉంది, విద్యుత్‌ సౌకర్యం కూడా ఉంది.

హెవీ వాటర్‌ తరలింపు పోరాటం
జర్మనీ ముందుగా హెవీ వాటర్‌ కావాలని నార్వేను అడిగింది. నార్వే అంగీకరించలేదు. అప్పుడు ఆక్రమణ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఫ్రాన్స్‌ హెవీ వాటర్‌ను తీసుకెళ్తుందని జర్మనీ గుర్తించి ఫ్రాన్స్‌పై కూడా దాడి ప్రణాళిక వేసింది. 1940 ప్రారంభంలో ఫ్రెంచ్‌ సైన్యానికి సమాచారం అందింది. క్యూరీ అల్లుడు హెవీ వాటర్‌తో జర్మనీ బాంబు తయారు చేస్తోందని హెచ్చరించాడు. ఫ్రాన్స్‌ రహస్య ఏజెంట్‌ను నకిలీ పేరుతో నార్వేకు పంపింది. అతను లీఫ్‌ ట్రాన్‌స్టాడ్‌ను కలిశాడు. ట్రాన్‌స్టాడ్‌ హెవీ వాటర్‌ ప్లాంట్‌ను డిజైన్‌ చేసిన ముఖ్య వ్యక్తి, నాజీలపై తీవ్ర వ్యతిరేకి. జర్మన్‌ ప్రణాళిక విన్న తర్వాత నార్వే మొత్తం హెవీ వాటర్‌ను ఫ్రాన్స్‌కు ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించింది. కానీ తరలింపు బాధ్యత పూర్తిగా ఫ్రాన్స్‌దే, జర్మనీ చేతికి చిక్కకూడదని షరతు విధించాడు. నార్వేలో జర్మన్‌ గూఢచారులు పుష్కలంగా ఉండటంతో ప్రత్యేక బాక్సులు తయారు చేసి నెదర్లాండ్స్‌ మీదుగా తరలించారు. సమాచారం జర్మన్‌ గూఢచర్యానికి చేరడంతో విమానాలు చుట్టుముట్టాయి. అయితే ట్రాన్‌స్టాడ్‌ రెండు విమానాలు బుక్‌ చేసి ఒకదాంట్లో బాక్సులు, మరొకటి ఖాళీగా పంపించాడు. జర్మన్లకు ఏమీ దొరకలేదు. తర్వాత జర్మనీ నార్వేను ఆక్రమించి, ఫ్రాన్స్‌పై దాడి చేసింది. ఫ్రాన్స్‌ హెవీ వాటర్‌ను ఇంగ్లండ్‌కు పంపింది. జర్మనీ నార్వే ప్లాంట్‌ను తెరిచి ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించింది. ట్రాన్‌స్టాడ్‌ ఇంగ్లండ్‌కు పారిపోయి, తాను డిజైన్‌ చేసిన ఫ్యాక్టరీని పేల్చాలని ప్రణాళిక వేశాడు.

సాబోటేజ్‌ ఆపరేషన్లు..
1942లో ఇంగ్లండ్‌ నుంచి రెండు బాంబర్‌ ఫ్లైట్లు నార్వేవైపు బయల్దేరాయి. వాతావరణం అనుకూలించక కూలిపోయాయి. అనేకమంది చనిపోయారు, ప్రాణాలతో బయటపడినవారిని జర్మన్‌ సైన్యం పట్టుకుంది. దీంతో హెవీ వాటర్‌ మిత్రరాజ్యాల లక్ష్యమని జర్మనీ గుర్తించి, మిగిలిన హెవీ వాటర్‌ను జర్మనీకి తరలించాలని నిర్ణయించింది. నార్వేజియన్‌ తిరుగుబాటుదారులు ఫెర్రీ ద్వారా తరలింపు జరుగుతుందని తెలుసుకుని, ఎవరికీ కనబడకుండా ఫెర్రీలోకి చొచ్చుకుపోయి టైమ్‌ బాంబు పెట్టారు. 1944 ఫిబ్రవరి 20 ఉదయం 10:20కి ఫెర్రీ పేలిపోయింది. హెవీ వాటర్‌ మొత్తం సముద్రంలో కలిసిపోయింది. నార్వే సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది యుద్ధకాల నైతిక సంక్లిష్టతను చూపుతుంది. జర్మనీ గ్రాఫైట్‌ను సరైన రీతిలో శుద్ధి చేసి ఉపయోగించే అవకాశాన్ని గుర్తించలేకపోయింది. స్జిలార్డ్‌ వంటి శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించి, హిట్లర్‌కు తెలియకుండా దాచారు. తర్వాత హెన్రి కోవర్క్స్, స్జిలార్డ్‌ కలిసి గ్రాఫైట్‌ను శుద్ధి చేస్తే మంచి మోడరేటర్‌గా పనిచేస్తుందని కనుగొన్నారు. ఫెర్మి నివేదిక తయారు చేయబోతుండగా స్జిలార్డ్‌ ఆందోళన చెంది ఆపేశాడు. ఆ తర్వాత ఐన్‌స్టీన్‌ వద్దకు వెళ్లి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌కు లేఖ రాయమని కోరాడు.

అలర్ట్‌ అయిన అమెరికా..
ఐన్‌స్టీన్‌ లేఖ రాసిన వెంటనే అమెరికా భారీ నిధులు కేటాయించి పరిశోధన ప్రారంభించింది. అప్పటి వరకు అమెరికా వద్ద స్వంత టెక్నాలజీ లేదు. పరిశోధన ఎక్కువగా జర్మన్‌ నేపథ్యం ఉన్న శాస్త్రవేత్తలదే. బాంబు తయారీకి ఎంత యురేనియం కావాలో కూడా స్పష్టంగా తెలియదు. బ్రిటన్‌కు చెందిన మాడ్‌ కమిటీ సమాచారం అందించింది. ఆ ఆధారంగా అమెరికా రియాక్టర్‌ తయారు చేసి ప్లుటోనియం ఉత్పత్తి చేసి అణు బాంబు అభివృద్ధి చేసింది. జపాన్‌ కూడా అణు బాంబు తయారు చేయాలని భావించి జర్మనీ సహాయం కోరింది. 1945 ఏప్రిల్‌ 15న ఒక సబ్‌మెరైన్‌ సరుకుతో జర్మనీ నుంచి జపాన్‌కు బయల్దేరింది. బాంబు తయారీ, రాకెట్‌ సాంకేతికత అంతా అందులో ఉంది. 1945, మే 8న జర్మనీ లొంగిపోయింది. సబ్‌మెరైన్‌ సగం దూరం వచ్చి చార్జింగ్‌ కోసం నీటిపైకి వచ్చినప్పుడు హిట్లర్‌ మరణం, జర్మనీ లొంగుబాటు తెలిసి కెప్టెన్‌ కూడా లొంగిపోయాడు. దీంతో జర్మన్‌ సాంకేతిక సమాచారం అమెరికా చేతికి చిక్కింది.

ఎందుకు జర్మనీ వెనుకబడింది..
జర్మన్‌ కార్యక్రమం విఫలానికి అనేక పొరపాట్లు కారణం. మోడరేటర్‌ ఎంపికలో తప్పు అంచనా, గ్రాఫైట్‌ను సరిగా పరీక్షించకపోవడం, వనరుల కొరత, యుద్ధ ప్రాధాన్యతలు, శాస్త్రవేత్తల మధ్య సమన్వయ లోపం, మిత్రరాజ్యాల నిరంతర సాబోటేజ్‌ ప్రధానమైనవి. నార్వే ఆపరేషన్లు జర్మన్‌ ఉత్పత్తిని నెలలు, సంవత్సరాలు ఆలస్యం చేశాయి. అమెరికా విజయం కేవలం సాంకేతిక ఆధిక్యం వల్ల కాదు; అది రాజకీయ నిర్ణయం, వనరుల సమీకరణ, అంతర్జాతీయ శాస్త్రీయ సహకారం, సకాలంలో సమాచారం సేకరణ కలయిక. హెవీ వాటర్‌ పోరాటం చూపించేది ఏమిటంటే, అణు యుగం ప్రారంభంలో సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు, సరైన వ్యూహాత్మక ఎంపికలు, సమయం, భౌగోళిక నియంత్రణ, మానవ కారకాలు కూడా నిర్ణయాత్మకమని.

ఈ చరిత్ర నేటికీ గుర్తు చేసేది శాస్త్రీయ ఆవిష్కరణలు రాజకీయ, నైతిక సందర్భాల్లో మార్పు చెందుతాయి. నార్వే పర్వతాల్లోని ఆ చీకటి రాత్రి కేవలం ఒక ఫ్యాక్టరీని ధ్వంసం చేయడం కాదు.. అది అణు యుగం దిశను ప్రభావితం చేసిన చర్య. అదే సమయంలో పౌరుల ప్రాణనష్టం, శాస్త్రవేత్తల నైతిక సంఘర్షణలు యుద్ధం యొక్క సంక్లిష్టతను ఎప్పటికీ గుర్తు చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper