
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పై దండయాత్ర చేస్తానన్నాడు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడులు పెరిగిపోతున్నాయని.. జగిత్యాల జిల్లాలో దాడులను ఖండిస్తున్నట్టు బండి తెలిపారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన బండి బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇలాగే చేస్తే తర్వాత దాడి జరిగేది ప్రగతి భవన్ పైనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడులు చేస్తే చూస్తూ ఉరుకోవడానికి మాది టీఆర్ఎస్ పార్టీ కాదు.. బీజేపీ అంటూ ఎంఐఎం నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. చట్టం తెచ్చి 6 నెలలు అయినప్పటికీ ఫాంహౌస్ లో పండుకొని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నావ్ అంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు.
సన్నరకాలు పండించిన తెలంగాణ రైతుల బాధలను కేసీఆర్ అర్థం చేసుకోవడం లేదని బండి విమర్శించారు. కేసీఆర్ మాత్రం తన ఫాంహౌస్ లో డొడ్డు బియ్యాన్ని పండించాడని విమర్శించారు. కేంద్రం 120 కోట్ల రూపాయలు ఇస్తే కేసీఆర్ జేబులో వేసుకున్నాడని విమర్శించారు. నిరుద్యోగ యువకులకు రూ.3వేలు ఇస్తామన్న కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
దేశ ప్రధాని మోడీ రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమచేశారని.. రైతులకు నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువస్తే కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు లాభం చేకూరేలా కొత్త చట్టం ఉందని చెప్పుకొచ్చాడు.