Mangalagiri: సీఎం జగన్ దూకుడు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ లు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదని భావిస్తున్నారు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పంలో ఇప్పటికే ఆపరేషన్ ప్రారంభించారు. అక్కడ భరత్ ను ఇన్చార్జిగా నియమించి ఎమ్మెల్సీగా చేశారు. కుప్పం మున్సిపాలిటీ తో పాటు మిగతా 5 మండలాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. కుప్పం బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన ఖాళీ ఉంటే చాలు కుప్పంలో వాలిపోతున్నారు. ఇప్పుడు లోకేష్ పై పడ్డారు. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గెలవకూడదని భావిస్తున్నారు. ఆ బాధ్యతను విజయ సాయి రెడ్డికి అప్పగించారు.
తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండే గంజి చిరంజీవిని వైసీపీలోకి రప్పించారు. మంగళగిరి అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. చేనేత సామాజిక వర్గం అధికంగా ఉండే మంగళగిరిలో.. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని ఎంపిక చేయడం వ్యూహాత్మకమని తెలుస్తోంది. అయితే అక్కడ చిరంజీవికి వైసీపీ శ్రేణుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం దక్కడం లేదు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ వైసిపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలోనే గంజి చిరంజీవిని మార్చుతారని ప్రచారం జరిగింది. కానీజగన్ మాత్రం ఆ సాహసం చేయలేదు.
ప్రస్తుతం మంగళగిరి సమన్వయ బాధ్యతలను విజయసాయి రెడ్డికి జగన్ అప్పగించారు. దీంతో విజయసాయి ఆ నియోజకవర్గంలో పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. చిరంజీవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న హనుమంతరావు, కాండ్రు కమల లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చిరంజీవి సైతం తనకు ఎదురవుతున్న సహాయ నిరాకరణను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ కు విజయసాయిరెడ్డి నివేదిక ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరు నేతలను జగన్ పిలిపించుకుని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ప్రతిష్టాత్మకమని.. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ను ఓడించాల్సిందేనని ఇద్దరు నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఆ ఇద్దరు నేతలు మెత్తబడినట్లు సమాచారం. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న చేనేత వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మంగళగిరిలో లోకేష్ ను ఎలాగైనా ఓడించాలన్న ధ్యేయంతో వైసిపి పనిచేస్తోంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.