Homeజాతీయ వార్తలుప్రలోభాల పర్వం.. కిలో మటన్‌, మందుబాటిల్‌

ప్రలోభాల పర్వం.. కిలో మటన్‌, మందుబాటిల్‌

Nagarjuna Sagar Elections 2021
నాగార్జున సాగర్‌‌ ఉప ఎన్నిక కథ క్లైమాక్స్‌కు చేరింది. పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. రేపటితో ప్రచారానికి చివరి రోజు కావడంతో తమ ప్రచారాన్ని మరింత పెంచాయి. లీడర్లు ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. క్యాండిడేట్లపై దాడులు సైతం జరుగుతున్నట్లుగా చూస్తున్నాం.

సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని టీఆర్‌‌ఎస్‌.. ప్రతి ఎన్నికల్లోనూ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితిలో ఉన్న కాంగ్రెస్‌.. ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ ఉప ఎన్నికలోనూ ఎవరూ ఊహించని విధంగా రిజల్ట్‌ సాధించి మరోసారి రాష్ట్రంలో బీజేపీ సత్తాచాటాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఏకిపారేస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీస్తూనే ఉన్నాయి. ఎడమ కాల్వ ఆయకట్టు పరిస్థితిన పోల్చుతూ టీఆర్‌‌ఎస్‌ ఓట్లు అభ్యర్థిస్తుండగా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలుపై విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇక బీజేపీ అయితే కేంద్రం ఇచ్చిన నిధులను, కేంద్రం స్కీమ్‌లను ప్రజలకు వివరిస్తూ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు ప్రలోభాలు పెట్టేందుకు రంగంలోకి దిగుతున్నాయి. ఇందుకు ఉగాది పండుగను అందివచ్చిన అవకాశంగా వినియోగించుకున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా పలు పార్టీలు మాంసం, మద్యం పంపిణీ చేశాయి. మాడుగులపల్లి మండలం గజలాపురం, కొణతాలపల్లి, కన్నెకల్‌, గారుకుంటపాలెం తదితర గ్రామాల్లో ఇది వెలుగుచూసింది. ఉగాదిని పురస్కరించుకొని ఓ ప్రధాన పార్టీనే కిలో మటన్‌, మద్యం బాటిల్‌ను ఇంటింటికీ అందించింది. అయితే.. ఇది తెలిసిన మరో పార్టీ కిలో చికెన్‌ను అందించారు. ఇక మరో పార్టీ అయితే.. పండుగ గిఫ్ట్‌ కింద ఇంటింటికీ రూ.500 పంపిణీ చేసింది.

మరో నాలుగు రోజుల్లో సాగర్‌‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగబోతోంది. నాలుగు రోజుల ముందే ఈ పంపకాల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఈ మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఎలాగైనా ఈ ఎన్నికలో గెలుపొందాలనే లక్ష్యంతో పార్టీలు పోటాపోటీగా ప్రలోబాలకు తెరలేపినట్లుగా అర్థమవుతోంది. ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో చూడాలి మరి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular