తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర అప్పుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) చివరికి అంటే ఈ నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు రూ.2.45 లక్షల కోట్లని వెల్లడించారు. ఇవి కాకుండా వివిధ స్కీమ్లు అమలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలకు.. ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ తదితర కార్పొరేషన్లకు విడిగా పూచీకత్తు ఇచ్చిన రుణాలు మరో రూ.లక్షా 5 వేల కోట్లున్నాయి. ఈ రెండూ కలిపితే ఈ నెలాఖరు నాటికే మొత్తం అప్పులు రూ.3.50 లక్షల కోట్లకు చేరుతాయి. వీటికి కట్టే కిస్తీలు, మిత్తీలకే బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించారు.
Also Read: తమిళనాడులో తెలుగోళ్ల ఓటు ఎటు?
రాష్ట్ర జనాభా 2018 నాటికి 3.72 కోట్లుంది. ఈ లెక్కన ప్రస్తుతం తలసరి అప్పు రూ.94,086గా ఉంది. వచ్చే ఆర్తిక సంవత్సరం (2021–22)లో మరో రూ.41,522 కోట్ల అప్పులు తీసుకుంటామని ప్రభుత్వంవెల్లడించింది. దీంతో మొత్తం అప్పులు 3.91 లక్షల కోట్లకు చేరి.. తలసరి అప్పు లక్షా ఐదు వేలకు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చే ఏడాది ఇచ్చే పూచీకత్తును పరిగణనలోకి తీసుకోకుంటే ఇది మరికొంత పెరుగుతుంది.
2016–19 మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్డీపీలో వార్షిక అప్పుల సగటు నిష్పత్తి శాతం 21.1 ఉంది. ఈ ఏడాది (2020–21)లో మరో రూ.41,522 కోట్ల అప్పులు తీసుకున్నా జీఎస్డీపీలో 24.84 శాతానికి చేరుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనికి కారణం రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడమే. కరోనా కారణంగా ఆదాయం పడిపోయినా రైతుబంధు, పింఛన్లు వంటి పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మరింత ఎక్కువగా అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వేలో తెలిపింది. కేంద్రం కూడా రాష్ట్ర జీఎస్డీపీలో అదనంగా మరో 2 శాతం వరకూ అప్పులు తీసుకోవడానికి ఈ ఏడాది అనుమతించింది. అంతకుముందు జీఎస్డీపీలో 3 శాతం వరకే అప్పులు తీసుకునే అవకాశముండేది. ఇప్పుడు 5 శాతం వరకూ అనుమతించినందున మరిన్ని అప్పులు తీసుకోవడానికి అవకాశమేర్పడింది. ఈ పరిమితికి లోబడే రుణాలు తీసుకోవడంతోపాటు జాతీయ సగటుతో పోల్చితే తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2016–19 మధ్య కాలంలో ఏటా అప్పులపై వడ్డీల చెల్లింపులకే రాష్ట్ర ఆదాయంలో 11.7 శాతం సొమ్ము వెచ్చించింది. జాతీయ స్థాయిలో ఈ సగటు 13.1 శాతముందని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో తాజాగా వెల్లడించింది.
Also Read: కాంగ్రెస్ కన్నెర్ర చేస్తే.. ఠాక్రే పరిస్థితి ఏంటి..?
రూల్స్ ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 25 శాతం మించకూడదు. మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరిపోతుంది. లెక్కలేనన్ని గ్యారంటీలు ఇవ్వటంతోపాటు అప్పులు చేసిన తీరు చూస్తే ఈ హద్దులను ప్రభుత్వం ఎప్పుడో దాటింది. కానీ బడ్జెట్అంచనాల్లో జీఎస్డీపీలో 24.84 శాతం అప్పులున్నట్లు చూపించింది. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు.. ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు. గత ఏడేండ్లలోనే ఇది ఐదున్నర రెట్లు పెరిగిపోయింది.
2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున రుణాల సమీకరణకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మొత్తం రూ. 49,300 కోట్ల మేరకు అప్పులు తీసుకోనున్నట్లు వెల్లడించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే దాదాపు 5 వేల కోట్ల అప్పు ఎక్కువగా ప్రతిపాదించింది. ఓపెన్ మార్కెట్ రుణాల కింద రూ. 47,600 కోట్లు, కేంద్రం నుంచి రూ. 200 కోట్లు, ఇతర రుణాలు రూ. 1,500 కోట్లు సమీకరించాలని ప్లాన్ చేసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.34 వేల కోట్ల రుణాలు అంచనా వేయగా, కరోనా ఎఫెక్ట్ వల్ల కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిధి పెంచడం కలిసొచ్చింది. దీంతో అం తకు భారీగా రూ.43,984 కోట్లు ప్రభుత్వం అప్పు తెచ్చింది. కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఇతర సంస్థల నుంచి రూ. 650 కోట్లు సమీకరించింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Telangana has a per capita debt of rs 105000
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com