Viral Video: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు. అహంకార పూరిత మాటలు.. కుటుంబ పాలన, అవినీతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, చోటామోటా నాయకుల దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ను ఓటుతో ఇంటికి పంపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ను గెలిపించారు. 64 సీట్లతో కాంగ్రెస్ అధికారం చేపట్టగా 39 స్థానాలతో బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఎన్నికలు ముగిసిన పక్షం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. తెలంగాణ ఆడబిడ్డ, రైతుబిడ్డ అయిన యువతి ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడీ వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది.
సూటిగా ప్రశ్నించిన యువతి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఎందుకు ఓడించారు అన్నదే ఆ యువతి ప్రశ్నం. కారణం లేకుండానే బీఈఆర్ఎస్ను గద్దె దించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికోసం కొన్ని యూట్యూబ్ చానెళ్లు విస్తృతంగా కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేశాయని ఆరోపించింది. కొంతమంది నాయకులు గ్రామాల్లోకి వెళ్లి.. పింఛన్ పొందుతున్నవారి కాళ్లు కూడా పట్టుకున్నారని వెల్లడించింది. కాంగ్రెస్ ఓటు వేసినవారంతా నిజాయతీగా ఓటు వేశారా అని ప్రశ్నించింది.
తన తల్లి అనుభవాన్ని..
ఈ సందర్భంగా సదరు యువతి పదేళ్ల క్రితం తన తల్లి ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా గుర్తుచేసింది. నాడు రాత్రి కరెంటు వస్తే.. తన తల్లి అర్ధరాత్రి పొలం కాడికి పోయేదని, ఆమె ఇంటికి వచ్చే వరకూ భయం భయంగా గడిపేవారమని తెలిపింది. కేసీఆర్ వచ్చాక ఆ తిప్పలు తప్పాయని వెల్లడించింది. ఈ ఒక్క కారణం చాలాదా కేసీఆర్ను గెలిపించడానికి అని నిలదీసింది. ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారో చెప్పాలని నిలదీసింది.
ఉద్యోగాలు సాధించే సత్తా ఉందా..
ఉద్యోగాలు రాలేదు.. నోటిఫికేషన్లు ఇవ్వలేదని అంటున్న యువత.. మీలో ఎంతమందికి ఉద్యోగం సాధించే టాలెంట్ ఉందని ప్రశ్నించింది. సత్తా ఉన్నవారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడని, చేతగాని వాళ్లే ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని ఏడుస్తూ కూర్చుంటాడని విమర్శించింది. ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరికే ఒకే విధంగా టాలెంట్ ఉండదని, అలాంటప్పుడు తమ స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఉద్యోగాలు రాలేదని ప్రభుత్వాన్ని ఓడించడం సరికాదన్నారు.
హైదారాబాద్ అక్కున చేర్చుకుంది..
ఇదిలా ఉండగా, వలసవాదులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ కేసీఆర్ కావాలని కోరుకుంటే రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, ఉచిత కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న కేసీఆర్ను మాత్రం గ్రామీణ ప్రజలు వదులుకున్నారని తెలిపింది. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందినా.. కేసీఆర్ ఉంటేనే తమకు భద్రత ఉంటుందని అక్కడి ప్రజలు నమ్మి 14 ఎమ్మెల్యే సీట్లు గెలిపించారని వెల్లడించింది.
ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడిన మన తెలంగాణ ఆడబిడ్డ..#KCR #KTR #Telangana #Congress @Nallabalu1 @Krishank_BRS @2Captainparody @LathaReddy704 pic.twitter.com/YQ9bT86Btd
— KCR Adda (@KCR_Adda) December 13, 2023