కరీంనగర్ సంచరించిన ఒక ఇండోనేసియా మతప్రచారకుల బృందంలోని 10 మొత్తం మంది కూడా కరోనా వైరస్ కు గురికావడంతో ఆ దేశం నుండి తరచుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న బృందాలు రహస్య పర్యటనల గుట్టు రట్టయింది. గత నాలుగు నెలలోనే కనీసం నాలుగు బృందాలు ఆ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పర్యటనలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది.
వారెందుకు వస్తున్నారు? వారి కార్యకలాపాలు ఏమిటి? అనే అంశాలపై ఇప్పుడు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఒక నిషేధిత సంస్థ కార్యకలాపాల విస్తరణకు, తీవ్రవాద ఇస్లామిక్ ప్రచారం కోసమే వస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీ నుంచి రామగుండం రైల్వేస్టేషన్కు వచ్చి.. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్ వచ్చిన 10 మందితో కూడిన ఈ బృందం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో బస చేసింది.
పైగా వీరు వీసాలను ఏ కారణం చూపి తీసుకున్నారు? ఢిల్లీకి చేరుకొని, అక్కడి నుండి రైలులో కరీంనగర్ జిల్లాకు రావడానికి కారణం ఏమిటి? వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ తప్పుడు కారణాలు చూపడం కోసమే ముందు ఢిల్లీ చేరుకొని, తర్వాత ఇక్కడకు వస్తున్నారా? వీరి పర్యటనలు, కార్యక్రమాలను ఇక్కడ ఎవ్వరు పర్యవేక్షిస్తున్నారు? …. పోలీసుల దర్యాప్తులో ఈ అంశాలను వెలుగులోకి రావాల్సి ఉంది.
వీరిలో 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. వీరి గురించి ఆరా తీసినప్పుడు ఇండోనేషియా బృందాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించడం సర్వసాధారణమని తేలింది. మత ప్రచారం కోసం వచ్చినట్లు చెబుతుండగా… ప్రార్థనా మందిరాల్లో సమావేశాలు నిర్వహించి అదే మతానికి చెందిన వారికి ఏం బోధిస్తారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రార్థనా మందిరాలలో, స్థానికులను విచారించినప్పుడు ‘ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి… అక్కడి మత పెద్దల సూచనల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం సాగిస్తారని’ చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇండోనేషియా సభ్యులు బృందాలుగా విడిపోయి ఒక్కో ప్రార్థనా మందిరంలో రెండు మూడు రోజులు గడుపుతూ వస్తున్నట్లు తేలింది.
రామగుండం నుంచి కరీంనగర్కు వచ్చిన ఇండోనేషియా బృందం ప్రార్థనా మందిరంలో బస చేసిన రోజులకు ఒకట్రెండు రోజుల ముందు మరో బృందం కరీంనగర్ రూరల్ ఏరియాలోని రేకుర్తి, సాలెహ్నగర్, గుంటూరుపల్లిలో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరు ఎక్కడికెళ్లారనే విషయంలో స్పష్టత లేదు.
గత నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసింది. ఈ కార్యక్రమానికి ఇండోనేషియాకే చెందిన బృందం హాజరైనట్లు సమాచారం. భార్యాభర్తలుగా దేశంలోకి వచ్చిన నాలుగు జంటలు ఫిబ్రవరి 8న ఢిల్లీ నుంచి రామగుండం చేరుకొని అక్కడి నుంచి జగిత్యాల ప్రాంతానికి చేరినట్లు తెలిసింది.
వీరు జగిత్యాలతోపాటు సిరిసిల్ల జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్లలోని ప్రార్థనా మందిరాల్లో తిరిగిన వీరు అదే నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత మత సంస్థ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. అక్కడి నుంచి రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలను కూడా సందర్శించి 18న తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.
జగిత్యాలకు వచ్చిన నాలుగు జంటల్లో మహిళలు మత పెద్దల ఇళ్లల్లో ఉండగా, పురుషులే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. జగిత్యాల ఎస్పీ సింధూశర్మ దీనిపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా తాజాగా హైదరాబాద్లోని ఆసిఫ్నగర్లో నాలుగు జంటల బృందం పర్యటిస్తుండగా, స్థానికుల సమాచారంతో వారిని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి క్వారంటైన్కు తీసుకెళ్లి పరీక్షలు జరిపారు. వీరు ఫిబ్రవరిలోనే కరీంనగర్ వచ్చినట్లు ఒప్పుకున్నారు.
కరీంనగర్కు వచ్చి కరోనా బారిన పడ్డ ఇండోనేషియా బృందం కన్నా ముందు కరీంనగర్ రూరల్ ప్రాంతంలో మరో బృందం పర్యటించింది. 8 మందితో కూడిన ఈ బృందం ఈ నెల 10 తరువాత కరీంనగర్లో పర్యటించినట్లు ఆనవాళ్లు లభించాయి. రేకుర్తి, సాలేహ్ నగర్, బొమ్మకల్, గుంటూరుపల్లిలలో ఈ బృందం తిరిగినట్లు పోలీసులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇదే బృందం రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ప్రార్థనా మందిరాల్లో బస చేసినట్లు సమాచారం.
ఈ లెక్కన రెండు నెలల వ్యవధిలో మూడు నుంచి నాలుగు బృందాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తోంది. నాలుగు నెలలుగా ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులు బృందాలుగా కరీంనగర్కు వస్తుండగా, అదే సమయంలో అతివాద భావాలు గల ఓ మత సంస్థ తన కార్యకలాపాలను ఉధృతం చేసింది.
జగిత్యాల, నిజామాబాద్లలో ఇప్పటికే ఒక వర్గంలో విద్యార్థులు, యువకులను భారీగా రిక్రూట్ చేసుకొని తన కార్యకలాపాలను విస్తృతం చేస్తున్న ఈ సంస్థ నాలుగు నెలలుగా కరీంనగర్పై దృష్టి పెట్టింది. తాజాగా ఈ నెల 17న కరోనాపై ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వందలాది మంది విద్యార్థులతో ఆ సంస్థ నాయకుడు సమావేశం ఏర్పాటు చేయగా, పోలీసులు భగ్నం చేశారు. నాయకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ అరెస్టుకు ఒకరోజు ముందు ఇండోనేషియా నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన 10 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Team tracing contacts of indonesian group in karimnagar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com