Stalin And YS Jagan: మనం సోషల్ మీడియా ( social media)యుగంలో ఉన్నాం. అయితే నిజం కంటే అబద్దం వేగంగా వెళ్ళవచ్చు కానీ.. కానీ అది అబద్ధం అని తెలిస్తే అబాసు పాలు కావడం ఖాయం. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్థితి. తమిళనాడు విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తమిళనాడులో విజయ్ గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోంది. విజయ్ గెలుపు వెనక జగన్ ఉన్నారన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రచార సారాంశం. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు కాబట్టి.. ఈ ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు కూడా హర్షించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి స్టాలిన్ తో ఉన్న బంధం అందరికీ తెలిసిన విషయమే. గతంలో చాలా సందర్భాల్లో ఆ ఇద్దరు నేతలు కలవడం.. ఒకరి హితాన్ని మరొకరు కోరుకోవడం రాష్ట్ర ప్రజలు చూశారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం విజయ్ తమ వాడిగా చెప్పుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
* ఇట్టే ఫ్యాక్ట్ చెక్..
సోషల్ మీడియా వచ్చాక క్షణాల్లో ఫ్యాక్ట్ చెక్ జరిగిపోతోంది. 2019లో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 సీట్లతో ఘన విజయం సాధించారు. దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూసింది ఆ సమయంలో. అటువంటి సమయంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దక్షిణాదిన ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆహ్వానం ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి. నాడు కెసిఆర్, స్టాలిన్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయ్ తమ వాడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతుండడంతో.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ తో పాటు స్టాలిన్ వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* అనుకూల విశ్లేషకులు సైతం..
చాలామంది విశ్లేషకుల రూపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై వీర విధేయత, అనుకూల విశ్లేషణలు చేసిన వారు ఉన్నారు. అటువంటివారు సైతం ఇదేం రాజకీయం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు అని చెబుతున్నారు. అది తెలిసి కూడా ఇటువంటి ప్రచారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలిసినప్పుడు ఇటువంటి సోషల్ మీడియా ప్రచారాలు ఎందుకని నిలదీస్తున్నారు. పైగా తమ పార్టీ నాయకురాలు రోజాను డీఎంకేకు మద్దతుగా ప్రచారానికి పంపించడం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటప్పుడు ఇటువంటి ప్రచారం అనేది ప్రతికూలతలు ఇస్తుందే తప్ప.. ఎటువంటి అనుకూలతలు ఇవ్వదనేది విశ్లేషకుల అభిప్రాయం.