Pakistan: మన దాయాది దేశం పాకిస్తాన్లో ప్రజా జీవనం దయనీయంంగా మారుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసరాల ధరలు చుక్కలను చూస్తున్నాయి. దీంతో సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. తాజాగా చౌకగా లభించే కోడిగుడ్డు కూడా అక్కడి ప్రజలను భయపెడుతోంది. పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజన్ గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినా రిటైల్ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కు విక్రయిస్తున్నారు. దీంతో చివరికి కోడిగుడ్డు కూర కూడా తినలేని పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది.
సోయాబీన్ దిగుమతికి అనుమతి..
పెరుగుతున్న గుడ్ల ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ జీవో విడుదల చేయలేదు. దీంతో ఇంకా దిగుమతి మొదలు కాలేదు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఫలితంగా ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొంది.
మటన్, చికెన్ ధరలు కూడా..
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. నిత్యవసర సరుకులు అందుబాటులో లేక పోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోడిగుడ్డుతోపాటు మటన్, చికెన్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. అల్లం ధర ఆకాశాన్నంటుతోంది. కిలో అల్లం రూ.1000కి చేరింది. పాకిస్తాన్లోని మార్కెట్లో ఏ వస్తువు ముట్టుకున్నా బగ్గుమంటోంది. ఇక కరాచీలో లైవ్ చికెన్ ధర కిలోకు రూ. 370, మటన్ కిలోకు 500 రూపాయలు. అదే సమయంలో, లాహోర్లో చికెన్ కిలోకు 365 రూపాయలు పలుకుతోంది. వీటితోపాటు కరాచీలో ముడిసరుకులతోపాటు పశుగ్రాసం ధరలు కూడా భాగా పెరిగాయి.