Varahi Yatra
Varahi Yatra: ఏపీలో పవన్ రాజకీయం మొదలు పెట్టారా? తనదైన రీతిలో రాజకీయం చేస్తున్నారా? ముల్లును ముల్లుతో తీయాలని భావిస్తున్నారా? వైసిపి అరాచక రాజకీయాలకు తగిన మోతాదులో మందు వేయాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ వ్యూహాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడం వాస్తవం. విపక్షాల గొంతు నొక్కడం నిజం. వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని జగన్ సర్కార్ విధ్వంసాలు సృష్టించడం అంతకుమించి నిజమని పవన్ భావిస్తున్నారు. అందుకే జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారాహి మూడో విడత యాత్ర సాగుతోంది. ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలు యాత్ర కొనసాగుతోంది. జోగి రమేష్ నిత్యం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ తరుణంలో ఆయన నియోజకవర్గంలోనే పవన్ యాత్ర చేస్తుండడం ఒక రకమైన పొలిటికల్ హీట్ నెలకొంది. ఇటువంటి తరుణంలోనే పెడన సభలో 3000 మంది అల్లరిమూకలు ప్రవేశించనున్నారని పవన్ ప్రకటించారు. దీనికి డిజిపి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పోలీస్ శాఖ అలెర్ట్ అయ్యింది. పవన్ సభకు భారీ సెక్యూరిటీ కల్పించింది. ఇది మంచి విషయమే అయినా.. అంతకంటే ముందే పవన్ కు ఏకంగా నోటీసు జారీ చేసింది. మీ వద్ద ఉన్న సమాచారం ఇవ్వాలని కోరింది. దీంతో పోలీస్ శాఖపై రాజకీయ ప్రమేయం ఏ స్థాయిలో ఉందో వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా పవన్ అంటేనే ఒక మేనియా. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు ముంచెత్తుతారు. వేలాదిగా తరలి వస్తారు. గంటలకొద్దీ వెయిట్ చేస్తారు. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడరు. ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే పెడన సభకు జన సమీకరణ కోసమే పవన్ ఆ ప్రకటన చేశారని వైసిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా కొత్త ప్రచారానికి తెర లేపాయి. మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలో జన సమీకరణ ఆషామాషీ కాదని.. అందుకే పవన్ ఈ కొత్త ఎత్తుగడను ప్రయోగించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో విశాఖలో పవన్ పర్యటన సమయంలోఇదేవిధంగా ప్రచారం చేశారని.. పవన్ కు హాని తలపెట్టబోతున్నారన్న ప్రచారంతోనే నాడు జన సైనికులు వెల్లువలా తరలివచ్చారని.. ఇప్పుడు కూడా అటువంటి ఎత్తుగడ వేశారని చెప్పుకొస్తున్నారు.
అయితే పవన్ విషయంలో ఇటువంటి ప్రచారాన్ని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. రాజకీయాల కతీతంగా ఆయనను ఎక్కువ మంది అభిమానిస్తారు. అందుకే పవన్ సైతం చెబుతుంటారు. తన అభిమానులు పక్క చూపులు చూడకుండా.. ఓటు వేస్తే చాలని వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. జన సమీకరణ లేకుండా పవన్ పర్యటనలు సాగుతాయనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. వాహనాలు ఏర్పాటు చేయకపోయినా, సభలు సమావేశాలకు రావాలని ఒత్తిడి చేయకపోయినా.. జనాలు వెల్లువలా తరలివచ్చేది ఒక్క పవన్ కోసమేనని అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో వైసీపీ కుహానా మేధావులు గొంతు చించుకున్నా ప్రజలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan varahi yatra krishna district is that pawans strategy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com