కరోనా వైరస్ బారినపడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రజల కోసం ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యం కుదుట పడుతోందని .. తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ, సినీ , సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు నేను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారని.. సందేశాలు పంపారని పవన్ చెప్పుకొచ్చారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, అభిమానులు నేను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో ప్రార్థనాల మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం నాదృష్టికి వచ్చిందని.. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారని.. కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేను అని పవన్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పటికీ వీరంతా నా కుటుంబ సభ్యులేనన్నారు.
ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుట పడుతోందని.. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తున్నానని.. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తానని పవన్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి మీతోపాటు ప్రజల కోసం నిలబడుతానని పవన్ తెలిపారు.