దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో జాతీయ కాంగ్రెస్లో ఏదో ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకోబోతున్నట్లు ధీమా ఇప్పుడు రాహుల్ గాంధీలో కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మోడీపై వ్యతిరేక పెరిగిందని.. ఆయనపై పాలనపై ప్రజల్లో నమ్మకం పోయిందని అంటున్నారు. ఇదే క్రమంలో తమ పార్టీని కూడా పూర్తి ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని సిధపడుతున్నారట.
మొత్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త టీమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారట. రాహుల్ కూడా పార్టీ పగ్గాలు చేపట్టి.. పార్టీని పునర్నిర్మించాలనే ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీపై వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. ప్రచార ఆర్భాటం తప్ప.. మోడీ పెద్దగా చేసిందేమీ లేదని ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. ఈ ప్రభావం కాస్త ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చూపే అవకాశాలూ లేకపోలేదు. అందుకే.. ఈసారి బీజేపీకంటే ఎక్కువ సీట్లు తమకే వస్తాయని కాంగ్రెస్ కుండబద్దలు కొడుతోంది.
కేరళలో ఎన్నికల ముందు వరకు కూడా ఎల్డీఎఫ్కు సానుకూల పవనాలే వీచాయి. కానీ.. ఎన్నికల టైమ్ వచ్చేసరికి ప్రజలు యూడీఎఫ్ వైపు మళ్లారు. ఇదే విషయాన్ని రాహుల్ తన సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. ఇక తమిళనాడులో డీఎంకే విజయ తథ్యం. అస్సోంలోనూ కాంగ్రెస్కు సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. అందుకే.. రాహుల్ గాంధీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఎలాగూ పార్టీకి పాజిటివ్ టాక్ వస్తుండడంతో.. దానికి క్యాష్ చేసుకోవాలని ఇప్పటి నుంచే ఆయన ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే.. మరికొద్ది రోజుల్లోనే పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సైతం ఉండడంతో అక్కడా సత్తాచాటాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాక.. రాహుల్ పూర్తిగా ఉత్తరప్రదేశ్కే పరిమితం కానున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 2024 ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ ఇప్పటి నుంచే తన వేగులను సిద్ధం చేస్తూ.. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లుగా అర్థమవుతోంది.