Online Tickets: ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ వ్యవస్థతో అసలు ఎవరికి ప్రయోజనం అన్న చర్చ సాగుతోంది. ఏపీ సర్కార్ సినిమా టికెట్లతో క్యాష్ చేసుకుంటుందని కొందరు విమర్శిస్తుండగా.. సినీ ప్రముఖుల కోరిక వల్లనే తాము ఇలా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఇంతకీ ఎవరిది రైటు? ఆన్ లైన్ టికెటింగ్ వల్ల ప్రయోజనం ఎంత? సినీ ప్రముఖులు ఈ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థపై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు.? అనే దానిపై స్పెషల్ ఫోకస్..
ఒక నిర్మాత కోట్లు పెట్టి సినిమా తీసి థియేటర్లో విడుదల చేస్తే ఆ నిర్మాతకు సరిగ్గా కాసులు రావడం లేదు. అలాగని సగటు ప్రేక్షకుడికి చీప్ గా ఏం సినిమా టికెట్ దొరకడం లేదు.. చూడడం లేదు. బ్లాక్ లో వెయ్యి రూపాయల వరకు తొలి షోకు, బెనిఫెట్ షోలకు వసూలు చేస్తున్నారు. దీనివల్ల నిర్మాత ఆ సొమ్ము నేరుగా అందక, ఇటు ప్రేక్షకులకు తక్కువ ధరకు టికెట్ దొరకక ఇద్దరూ మునుగుతున్నాడు. మధ్యలో ఈ సొమ్ము తింటున్నది థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రి బ్యూటర్లు.. దళారులు. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, నిర్మాతలు పట్టుబడుతున్నది అందుకే. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ ద్వారా సగటు ప్రేక్షకుడికి తక్కువ రేటుకే టికెట్ లభిస్తుంది. ఆ సొమ్ము డైరెక్టుగా నిర్మాత జేబులో పడుతుంది. నిర్వహించినందుకు ప్రభుత్వానికి ప్రతి టికెట్ పై పన్ను రూపంలో ఆదాయం వస్తుంటుంది. ఇన్నాళ్లు ఇవన్నీ ఎగ్గొట్టి జేబులో వేసుకున్న వారి ఆట కట్టవుతుంది. అందుకే ఈ ఆన్ లైన్ టికెటింగ్ కు నిర్మాతలు సినీ ప్రముఖులు మద్దతు తెలిపేది.
నిన్న చిరంజీవి కూడా ఇదే ఆవేదన చెందారు. ఏదో నలుగురైదుగురు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని.. వారిని పట్టుకొని సినీ ఇండస్ట్రీ అంతా బాగుందని అనుకోవద్దని.. చాలా సమస్యలున్నాయని వాటిని తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించాలని పిలుపునిచ్చాడు. దీనికి ఏపీ సీఎం జగన్ స్పందించారు. మంత్రి పేర్ని నానితో ఈరోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులను.. సినీ నిర్మాతలను.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై చర్చించారు. ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపారు.
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్ పుట్స్ ఇచ్చి సహకరిస్తామని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో విషయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్ని నాని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు రకరకాల అంశాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఇక సినీ ఇండస్ట్రీ సమస్యలపై గళమెత్తిన మెగాస్టార్ చిరంజీవి ఆవేదనపై కూడా ఏపీ ప్రభుత్వం స్పందించింది. చిరంజీవంటే సీఎం జగనుకు ఇష్టమే.. సోదర భావంతో ఉంటారు.
ఆయన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.
ఇక ఏపీలో షూటింగులు చేస్తామని సినీ నిర్మాతలు ప్రకటించారు. స్టోరీ డిమాండ్ చేసిన దాని బట్టి ఏపీలో కూడా షూటింగ్ లు కొనసాగిస్తామని నిర్మాతలు చెప్పుకొచ్చారు.
మొత్తంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో పడిపోయిన సినీ సమస్యలపై ఒక గొప్ప ముందడుగు అయితే పడిపోయింది. మధ్యలో థియేటర్లు, దళారులు తింటున్న సినిమా బ్లాక్ మార్కెట్ దందాకు ‘ఆన్ లైన్ టికెటింగ్’ వ్యవస్థతో చెక్ పడనుంది. ఈ వ్యవస్థతో సినీ ఇండస్ట్రీ బాగుపడుతుందని సీనీ ప్రముఖులు చెబుతున్నారు. ప్రభుత్వానికి కాసింత ఆదాయం వచ్చి ఇరువర్గాలకు లాభం చేకూరుస్తుందని అంటున్నారు.