Homeఆంధ్రప్రదేశ్‌జగన్ తీరుతో రైతులకు వేల కోట్ల నష్టం: వీర్రాజు

జగన్ తీరుతో రైతులకు వేల కోట్ల నష్టం: వీర్రాజు

జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నిప్పులు చెరిగారు. మరోసారి జగన్ పాలనతీరును ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వం అవగాహన లేమితో అధికారులు, దళారుల దోపిడీని నిలువరించలేక వ్యవసాయాన్ని నిర్యక్షం చేస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, ప్రజలను ఇబ్బందులు పాల్చేస్తూ అసమర్ధపుపాలన సాగిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుల నుంచి గిట్టుబాటు ధరకు ధాన్యం, సకాలంలో కొనుగోళ్లు చేసి, నగదు పంపిణీ చేయాలని, సూక్ష్మ సేద్య విధానంలో పరికరాలు రైతులకు అందచేయలని, యంత్రపరికరాలు సబ్సిడీతో ఇవ్వాలని, పీఎంఎవై గృహ నిర్మాణ పథకంలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రాన్ని వేయాలని, ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

-వ్యవసాయానికి ఇబ్బందులు.. రైతులకు ఇక్కట్లు
విధానపరమైన అంశాల్లో ప్రభుత్వానికి శ్రద్దలేదన్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు రైతాంగాన్ని ఎన్నో విధాల ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే పదివేల కన్నా ఆర్ధికంగా లక్షలు నష్టపోతున్నారని అన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఈ ఏడాది 45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటికి 3,990 కోట్ల విలువైన 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందన్నారు. సేకరించిన ధాన్యానికి నగదు చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని ఆరోపించారు. సరైన ధర, సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని విమర్శించారు.

ఇలాంటి విధానం వల్ల రైతులు ఏటా కొన్ని వేల కోట్లు నష్టపోతున్నారన్నారు. ఈ లోపభూయిష్ట విధానం మారాలని, వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులను సమావేశపరచి యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. మిల్లర్ల ప్రమేయాన్ని మిల్లింగ్ కే పరిమితం చేయాలన్నారు.

– మైక్రో ఇరిగేషన్ పై నిర్యక్షం
రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ వ్యవస్థను నిర్యక్షం చేసిందన్నారు. ప్రధానంగా రాయలసీమ ఈ విధానంపై ఆధారపడిందని కాని రెండేళ్లలో ఒక ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. టెండర్లు పిలవలేదని, గత ప్రభుత్వం కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ఈ ఏడాది ఇవ్వలేదని ఆక్షేపించారు. కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం వ్యవసాయానికి ఉపయోగించే యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇవ్వాల్సి ఉంటే వాటిని అప్రాతిపదికన ఇవ్వాలని ఈ ప్రభుత్వం యోచిస్తోందన్నారు.

-పీఎంఏవై ఇళ్లకు మోదీ చిత్రం తప్పనిసరి
ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా రాష్ట్రంలో నిర్మించే ఇళ్లకు తప్పనిసరిగా ప్రధాని మోదీ చిత్రాన్ని వేయాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. పిఎంఏవై పథకం కేంద్రపథకమని, 25 లక్షల ఇళ్లను రాష్ట్రంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కాని రాష్ట్రప్రభుత్వం 15 లక్షల ఇళ్లనే తాము నిర్మించగలమని అనుమతులు తీసుకుందన్నారు. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల సబ్సిడీ, 30 వేల నరేగా నిధులు మొత్తం కలిపి రూ.1.80 లక్షల సబ్సిడీని కేంద్రం ఇస్తోందన్నారు. కాని ఈ పథకాన్ని తన పథకంగా చెప్పుకుని వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, వీటికి తప్పనిసరిగా మోదీ ఫొటోను పెట్టాలన్నారు. లేకుంటే తామే మోదీ చిత్రాలను అమర్చుతామన్నారు. పీఎంఏవై ఇళ్ల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు కాక హౌసింగ్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో లబ్దిదారులే నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. లబ్దిదారులకు నగదు సబ్సిడీ, సిమెంటును సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులతోనే బోధనాసుపత్రుల నిర్మాణం

ఇటీవల శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి ముఖ్యమంత్రి ప్రజలకు తెలియచేయలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. వీటిలో 3 కళాశాలలకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తామని అనుమతి ఇచ్చిందని అదనంగా మరో 7 కళాశాలలకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, భాజపా రాష్ట్రశాఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అనుమతి లభించేలా వత్తిడి చేయనుందని చెప్పారు. మొత్తం పది వైద్యకళాశాలలకు లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మూడు కళాశాలలకే రూ.300 కోట్లు కేంద్రం నిధులు ఇచ్చిన విషయాన్ని ఇంకా కొన్ని కళాశాలలకు 60 శాతం నిధులు రానున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి శంకుస్థాపన సమయంలో ప్రజలకు చెప్పకపోవడం బాధకరమని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫాస్టర్లకు జీతాలు పెంచడం ప్రస్తుత సమయంలో అప్రధాన్యమని, దీనిని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్ళైనా జీతాలు ఇవ్వడాన్ని నిలుపుదల చేయిస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధనరెడ్డి, సూర్యనారాయణరాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణరెడ్డి పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular