తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోతుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత 2014లో తరువాత కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు తెచ్చుకున్న టీడీపీ 2019లో ఒక్క నియోజకవర్గంలో మాత్రమే పాగా వేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ మెల్లగా పార్టీని విస్తరించాలనుకున్నాడు. కానీ 2019లో ఆంధ్రలో కూడా ఓడిపోవడంతో తెలంగాణ టీడీపీని పూర్తిగా పట్టించుకోవడం లేదు.
Also Read: బీజేపీలోనూ అదే ‘కథ’: రాజకీయాలకు ‘మోత్కులపల్లి’ గుడ్బై.?
టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. అప్పటి వరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన వారు ఆ తరువాత సైకిల్ జెండాను పక్కన పడేశారు. దీంతో పార్టీని పట్టించుకునేవారు కరువవడంతో రానురాను పార్టీ నామరూపాల్లేకుండా పోతుందా..? అనే చర్చ సాగుతోంది. పార్టీకి సరైన నాయకుడు లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పార్టీ నియమించిన కమిటీల్లో తెలంగాణకు అధ్యక్షుడిగా మళ్లీ రమణకే పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. కొన్ని సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేసిన రమణతో పార్టీ మరింత దిగజారిందని ఉన్న కొద్ది మంది నాయకులు బాబుకు మొర పెట్టుకున్నా ఆయన బీసీ నేతకే పట్టం కట్టాలనే ఉద్దేశంలో రమణను నియమించారు. దీంతో పార్టీలో ఉన్నవారు సైతం నిరాశ చెందుతున్నారు.
Also Read: దుబ్బాక వేడి: బీజేపీ వర్సెస్ పోలీస్.. రఘునందన్ ఇళ్లపై దాడి
రమణపై కొందరు నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఆయన రెగ్యులర్గా పార్టీ కార్యాలయానికి రాలేడని, ఎప్పుడో ఒకసారి ఆఫీసుకు రావడం వల్ల పార్టీ పటిష్టం కోల్పోతుందని అంటున్నారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారు రమణను కలవకుండానే వెళ్లిన సంఘటనలు చాలానే ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అధ్యక్ష పదవికి ఆయనను తప్పించాలని, మరొకరికి అవకాశం ఇవ్వాలని కొందరు కోరారు. కానీ చంద్రబాబు మాత్రం మళ్లీ ఆయననే నియమించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.