ఒకప్పుడు ముఠా కక్షలకు పేరొందిన నరసరావుపేట పట్టణం ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారికి వణికి పోతున్నది. ఒకప్పుడు చిన్న చిన్న పిల్లలు సహితం వీధులలో బాంబులతో చిందులేసిన పట్టణం ఇప్పుడు మరో మనిషిని చూస్తేనే పలకరించడానికి భయపడే పరిష్టితి నెలకొంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఒక చిన్న పట్టణంలో భారీగా కరోనా వైరస్ కేసులు విజృభించడంతో అధికారులు సహితం అవాక్కవుతున్నారు. ఇప్పటికే 148 కేసులు నమోదయ్యాయి. దానితో వరుసగా మూడు రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ప్రకటించారు. పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేశారు.
ప్రతి రోజు రెండంకెల స్థాయిలో వైరస్ కేసులు వస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ పట్టణం నుండి పరిసర మండలంలోని గ్రామాలకు సహితం వైరస్ వ్యాప్తి చెందింది. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐకి కూడా వైరస్ సోకింది.
ఈ నేపథ్యంలో నరసరావుపేటను మేజర్ హాట్స్పాట్గా గుర్తించినట్టు సబ్ కలెక్టర్ దినేశ్ కుమార్ వెల్లడించారు. రానున్న మూడు రోజులు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
ఈ నెల 15 కల్లా జీరో పాజిటివ్ కేసులు నమోదే లక్ష్యంగా ‘మిషన్ మే 15’ అమలు చేస్తున్నామని దినేష్ కుమార్ వెల్లడించారు. నరసరావుపేటలో సామాజిక వ్యాప్తిలో వైరస్ ఉందా? లేదా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, దీనికోసం ర్యాండమ్గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.