Homeజాతీయ వార్తలుTelangana Villages: తెలంగాణలో రెండు ఊర్ల పేర్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు కారణం ఏంటి?

Telangana Villages: తెలంగాణలో రెండు ఊర్ల పేర్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు కారణం ఏంటి?

Telangana Villages: తెలంగాణలో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసింది. నూతన పంచాయతీ చట్టం ప్రకారం తండాలను పంచాయతీలుగా ప్రకటించింది. నూతన పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇది జరిగి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా కొత్త మండలాల ఏర్పాటు జరుగుతూనే ఉంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు కొత్త మండలాలను ప్రకటిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రెండు ఊళ్ల పేర్లను మార్చింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

జగిత్యాల జిల్లాలో ఆ రెండు గ్రామాలు..
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలోని రెండు గ్రామాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గొల్లపల్లి మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌ గ్రామాన్ని శ్రీ రాములుపల్లిగా, అదే మండలానికి చెందిన తిర్మలాపూర్‌ గ్రామాన్ని మల్లన్నపేటగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజులలోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సూచించారు.

ఆ రెండు గ్రామాల పేర్లే ఎందుకు..

ఇబ్రహీంనగర్‌.. ఏళ్లుగా ఊరి పేరు ఒక సామాజిక వర్గం పేరుతో ఉంది. ఈ గ్రామంలో ఆ సామాజికవర్గంవారు వేళ్లపై లెక్కపెట్టేంద మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఏళ్లుగా తమ ఊరి పేరు శ్రీరాములపల్లిగా మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగా ఇదే మండలానికి చెందిన తిర్మలాపూర్‌ పేరును కూడా మల్లన్నపేటగా మార్చారు. ఈ గ్రామంలో యాదవులు ఎక్కువగా ఉంటారు. తమ కులదైవం అయిన మల్లన్న పేరుతో పిలిస్తే తమ ఊరికి మంచి జరుగుతుందని భావించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండు ఊళ్ల పేర్లను మార్చాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యమంత్రికి విన్నవించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పాలనా సౌలభ్యం కోసం..
పాలనాసౌలభ్యం, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లాలో ఐదు గ్రామాలను ఒక మండలం నుంచి మరో మండలానికి బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. చిలప్‌చెడ్‌ మండలంలోని అంతారం గ్రామాన్ని కౌడిపల్లి మండలానికి బదిలీ చేసింది. కౌడిపల్లి మండలంలోని మంగళపల్లి(డీపీ), దాసుగూడ, లింగారావుగూడ, శేరి ఫైజాబాద్‌ గ్రామాలను చిలప్‌చెడ్‌ మండలానికి మార్చారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామం పేరును మల్లన్నపేటగా, ఇబ్రహీంనగర్‌ గ్రామం పేరును శ్రీరాములపల్లిగా మార్చుతూ నోటిఫికేషన్‌ జారీచేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular