MLC Kavitha
MLC Kavitha: తెలంగాణలో నోరు ఉన్నోళ్లదే రాజ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ అంత మాటకారి ఎవరూ లేరు. ఆయన తర్వాత కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్రావు, కూతురు కవిత తమ మాటకారి తనంతో ఓటర్లను మెస్మరైజ్ చేస్తారు. ఇక మాట దూకుడు ప్రదర్శించడంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ కూడా ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్రెడ్డి మంచి మాటకారి. ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా మంచి తెలంగాణ సహజమైన యాసలో.. నుడికారాలు, సామెతలతో విరుచుకుపడడంలో వారికి వారే సాటి. అయితే కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడడంతో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన నిజామబాద్లో కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా విమర్శనస్త్రాలు సంధించారు. పేద ప్రజలకు ఆరోగ్య బీమా ఇవ్వకుండా చచ్చిపోతే రూ.5 లక్షలు వచ్చేలా లైఫ్ ఇన్సూరెన్స్ బీమా ఇవ్వడాన్ని ఎద్దేవా చేశారు. కేటీఆర్కు రూ.10 లక్షలు, తన చేతిలో ఓడిపోయిన కవితకు రూ.20 లక్షలకు తాను బీమా చేయిస్తానని గేలి చేశారు. నిజానికి కవిత మీద ఇంకా నిర్దిష్టమైన ఆరోపణలు కూడా మరికొన్ని చేశారు.
కవిత ప్రచారం ఇలా..
అర్వింద్ బీమా విషయాన్ని తప్పు పడితే మాటకారి కవిత మాత్రం.. అర్వింద్ తన అన్న కేటీఆర్తోపాటు తన చావు కోరుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. సానుభూతి ఓట్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ‘చావు’ను హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలపై విషం కక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. ‘నువ్వు చచ్చిపోతే రూ.20 లక్షలు ఇస్తా, మీ అన్న చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తా’ అంటూ అర్వింద్ మాట్లాడారని, ఆ భాష ఎలా కరెక్టో ప్రజలు ఆలోచించాలని సూచిస్తున్నారు.
నాడు దుర్భాషలాడి నేడు నీతులు..
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రాపాలకులపై కేసీఆర్ ఇలాంటి భాష మాట్లాడలేదని కవిత అంటున్నారు. కానీ.. కేసీఆర్ అంతకంటే నీచమైన, ఘోరమైన పదజాలంతోనే.. ఆంధ్రా పాలకుల్ని మాత్రమే కాదు కదా, ఆంధ్రకు సంబంధించిన మామూలు పౌరులందరినీ కూడా తూలనాడారు. ప్రజల్లో భావోద్వేగాలు, శత్రుభావనలు పెంచారనేది అందరికీ తెలుసు. ’చావు’ అనే పదం వాడినందుకు అర్వింద్ విమర్శలను తప్పుపడుతున్న కవిత.. ఆయన చేసిన అసలు ఆరోపణలను పక్కదారి పట్టించారనేది పలువురు అభిప్రాయంగా ఉంది.
అసలు విషయం పక్కదారి..
ఇక కవిత చేస్తున్న మరో పని ఏమిటంటే.. అర్వింద్ చేసిన తీవ్ర ఆరోపణను పక్కదారి పట్టించడం. ఎంపీ అర్వింద్.. కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని, వారిద్దరూ ఒకే కంపెనీలు డైరక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు. భారాస– కాంగ్రెస్ అక్రమ సంబంధాల గురించి బీజేపీ ఆరోపణలు చేస్తుండే సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లుగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేసి కాంగ్రెసులోకి వెళుతుండగా, దాని వెనుక కవిత వ్యూహం ఉన్నట్టు అర్వింద్ ఆరోపిస్తున్నారు. కవిత స్వయంగా రేవంత్తో మాట్లాడి ఆకుల లలితకు నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇప్పిస్తున్నారని.. ఆయన ఆరోపించారు. వారిద్దరి మధ్య వ్యాపార సంబంధాలు.. ఇలా అభ్యర్థుల ఫిరాయింపుల వెనుక మంత్రాంగం అనేదే ప్రధాన ఆరోపణ. కానీ కవిత ఈ విషయానికి సమాధానం ఇవ్వకుండా ‘చావు’ మాటలతో అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో అర్వింద్ ఆరోపణల్లో వాస్తవం ఉందనిపిస్తోంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Mlc kavitha condemned mp arvinds comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com