Homeఅంతర్జాతీయంHindu Temple In Pakistan: 72 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో హిందూ దేవాలయం తెరిచారు.....

Hindu Temple In Pakistan: 72 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో హిందూ దేవాలయం తెరిచారు.. అద్భుతం బయటపడింది

Hindu Temple In Pakistan: ప్రపంచంలోనే ప్రాచీన చరిత్ర భారతదేశ చరిత్ర అని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. అనేక కట్టడాలు వేల ఏళ్ల చరిత్రకు సాక్షాలుగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో సియాల్‌కోట్‌లోని దేవాలయం కూడా ఒకటి. దీనికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఈ ఆలయాన్ని పట్టించుకునేవారే లేరు. పూర్తిగా ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీలుగా జీవనం సాగిస్తున్నారు. అక్కడ∙మెజారిటీ ప్రజలదే ఆధిపత్యం. వారు చెప్పినట్లు చేయకుంటే మైనారిటీలు బతకలేని పరిస్థితి. ఈ క్రమంలో అక్కడి పురాతన ఆలయం ఏనాడో మూతపడింది. భారత్‌–పాక్‌ విభజన సమయంలో మూతపడిన ఆలయం మళ్లీ ఇప్పుడు తెరిచారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశాల ప్రకారం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు పాక్‌ మీడియా వెల్లడించింది.

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతిగా ఆలయం ధ్వంసం..
సుమారు 1000 ఏళ్ల కిందల సర్దార్‌ తేజా సింగ్‌ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. భారత్‌లోని బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం.. 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడిచేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం మానేశారు. అయితే.. పాక్‌ తాజా నిర్ణయంతో 72 ఏళ్ల క్రితం మూతపడిన ఆలయం మళ్లీ భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా.. ఆలయంలో దెబ్బతిన్న భాగాలను కూడా పునరుద్ధరించాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని పరిరక్షించే పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

చెక్కుచెదరని దేవతా మూర్తులు..
దేశ విభజన మనిషి చేసుకున్న అతి పెద్ద విపత్తు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ దారుణ ఘటనను రెండు దేశాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇండియా నుంచి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్‌ నుంచి ఇండియాకు ఎంతో మంది కట్టుబట్టలతో వలసలు వచ్చారు. పాకిస్తాన్‌లో ఉన్న మెజారిటీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య క్రమంక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ అక్కడి హిందువులు దుర్భర జీవితాన్ని గడపుతున్నారు. విభజన సమయంలో అక్కడ ఉన్న అనేక గుళ్లు గోపురాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. కొన్ని ఆలయాలను కూల్చేశారు. కొన్నేమో శిథిలావస్థకు చేరుకున్నాయి. సియాల్‌కోట్‌లో రాళ్లతో నిర్మించిన ఈ శివాలయం వాస్తు గొప్పగా ఉంటుంది. ఏడు దశాబ్దాలుగా ఆలయం మూసివేసి ఉన్నా గోడలు చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. అంత బలంగా నిర్మించారీ ఆలయాన్ని. 2019లో అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఈ ఆలయాన్ని తెరిచారు. దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్టించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న హిందువులు..
పూజలు మొదలుపెట్టారు. ఆలయం తలుపులు తెరుచుకున్న సమయంలో అక్కడ ఉన్న హిందువులు భావోద్వేగానికి లోనయ్యారు. హర్‌ హర్‌ మహాదేవ్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు చాలా దూరం వరకు ప్రతిధ్వనించాయట. పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అక్కడి హిందువులతోపాటు భారత దేశంలోని హిందువులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 72 ఏళ్లు ఎలాంటి పూజలకు నోచుకోని ఆలయం తెరుచుకోవడం సంతోషంగా ఉందంటున్నారు. ఆలయ పునరుద్ధరణకు కూడా అక్కడి ప్రభుత్వం ముందుకు రావడం శుభ పరిణామం అంటున్నారు. అయితే పిచ్చోడి చేతిలో రాయి చందంగా అక్కడి పాలకులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. పాలకులు మారినా ఆలయం ఎప్పటికీ తెరిచి ఉండాలని అక్కడి హిందువులు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular