ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేది టాక్. ఈ విస్తరణలో భాగంగా ఇప్పటివరకు మంత్రులుగా కొనసాగుతున్న వారిలో కొందరికి ఉద్వాసన పలికి.. మరికొందరికి వెల్కమ్ చెప్పేందుకు జగన్ రెడీ అయిపోయినట్లు సమాచారం. జగన్ మొదటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలకు.. రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తనతోపాటే తన టీమ్ కూడా పనిచేయాలని ముందు నుంచీ కోరుతున్నారు. 2019లో కేబినెట్ కూర్పులోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు.
అయితే.. రెండున్నరేళ్ల కాలంలో 90 శాతం మంది మంత్రులను మారుస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి రెండున్నరేళ్ల గడువు పూర్తవుతోంది. అయితే.. మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే ముందు.. ఇటీవల జగన్ స్థానిక సంస్థల్లో సత్తా చూపించేవారికి మాత్రం రెన్యువల్ ఉంటుందని అన్నారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నా.. కూడా ఇదే ప్రాతిపదికగా తాను ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రివర్గంలో స్థానం కోసం ప్రతి ఒక్కరూ అన్ని విధాలా కష్టపడ్డారు. మొత్తానికి స్థానిక ఫలితాల్లో 90 శాతాన్ని మించి దాదాపు రెండు తప్ప.. అన్నింటిలోనూ వైసీపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు సాధించేందుకు మంత్రులు, నేతలు బాగానే కష్టపడ్డారు.
అవంతి శ్రీను లాంటి ఒకరిద్దరు మంత్రులు మినహా దాదాపు అందరూ మంత్రులు సక్సెస్ అయ్యారు. మరో ఒకరిద్దరు మంత్రులు మాత్రం అనుకున్న స్థాయిలో కాకపోయినా పట్టు నిలుపుకున్నారు. ఈ క్రమంలో ఫ్యూచర్లో మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే.. ఎవరిని తప్పించాలి ? అనేది కీలకంగా మారింది. గ్యారెంటీగా తప్పించేస్తారనని ప్రచారంలో ఉన్న కొందరు మంత్రులు ఇప్పుడు తిరుగులేని ఫలితాలను రాబట్టారు. తొలుత విజయవాడకు చెందిన మంత్రి వెలంపల్లిని తొలగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. టీడీపీకి కంచుకోట వంటి విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. సో.. వెలంపల్లికి ఇది ప్లస్ అయింది. ఇక.. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ఇక్కడ కూడా ఆయన అనూహ్యంగా పార్టీని గెలుపుగుర్రం ఎక్కించారు. దీంతో ఆయనకు కూడా ఎలాంటి ఇబ్బందిలేదని అంటున్నారు. కడపలో అంజాద్ బాషా తిరుగులేని ఘనవిజయం సాధించి పెట్టారు.
ఈ ఫలితాలను బేరీజు వేస్తే 90 శాతం మంతి మంత్రుల్లో ఎవరిని ఉంచాలి..? ఎవరిని తీసేయాలన్నది..? జగన్కు పెద్ద సవాల్గా మారనుంది. ఇప్పటికిప్పుడు ఉన్న ట్రెండ్ను బట్టి.. అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే విశ్వరూప్, విశాఖ జిల్లా భీమిలి నుంచి గెలిచి.. మంత్రి అయిన అవంతి శ్రీనివాస్, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శంకరనారాయణ పేర్లు అవుట్ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరితోనే లెక్క సరిపెడతారా..? లేక ఇంకొంత మందిని తొలగింపు జాబితాలోకి సెలక్ట్ చేస్తారా..? అనేది చూడాలి.