పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ పోరు ఇంకా నడుస్తూనే ఉంది. మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు ఐదు విడతల్లో కంప్లీట్ అయింది. మరో మూడు విడతల్లో పోలింగ్ మిగిలి ఉంది. సుమారుగా వంద నియోకవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. ఈసారి అక్కడ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటికే బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ ఎంతో పట్టుదలతో ఉంది. మరోవైపు హ్యాట్రిక్ సాధించాలని మమత ఆరాటపడుతున్నారు.
ఐదు విడతల్లో పోలింగ్ ముగియగా.. తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమత, బీజేపీ తరఫున అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తించారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో చివరి ఘట్టం మిగిలి ఉంది. ఈ తరుణంలో మమత ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయంతో పార్టీకి చేటు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగబోతున్న మూడు నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేయకూడదని మమత నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అధినేత్రి నిర్ణయంతో ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలు, నేతలు ఖంగుతిన్నారు. అయితే.. ఇదే సమయంలో మమత నిర్ణయాన్ని బీజేపీ క్యాష్ చేసుకునేలా ఉంది. మమత ఎలాగూ ప్రచారానికి రాదు కాబట్టి.. తామే ప్రచారంలో దూసుకెళ్లాలని చూస్తున్నారు. ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలని మోడీ, అమిత్ షా కూడా పట్టుదలతోనే ఉన్నారు. ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇప్పటికే టీఎంసీకి చెందిన 29 ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను బీజేపీ లాగేసుకుంది. దీంతో అక్కడి ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అంతమందిని కోల్పోయిన కూడా మమతలో ఏమాత్రం ఆత్మస్థైర్యం తగ్గలేదు. ఇదే క్రమంలో ఆమె కాలికి గాయమైన కూడా లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్రాన్ని మరోసారి ఢీకొని హ్యాట్రిక్ సాధించాలని తపనతోనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రచారానికి వెళ్లొద్దని నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.