కరోనా వైరస్ నేపథ్యంలో దేశం అంతటా అలజడి రేగడం, దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు స్వీయ దిగ్బంధనంలో ఉండడంతో లోక్ సభ సమావేశాలు గడువుకన్నా 12 రోజుల ముందే నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
గత వారం రోజులుగా ఈ విషయమై పలువురు ప్రతిపక్ష సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం దేశం అంతా దిగ్బంధన పరిస్థితులు నెలకొనడంతో మరో దారి లేక సమావేశాల వాయిదాకు ఒప్పుకోవలసి వచ్చింది.
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ 3వ తేది వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేయాలని అఖిలపక్షం కోరింది.
వాయిదాకు ముందు లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే కీలకమైన 2020 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించింది. మరో రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్, టిఎంసి, డిఎంకే, శివసేన వంటి పార్టీలు తమ ఎంపిలను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావద్దని ఆదేశించాయి.