Homeజాతీయ వార్తలుకరోనా నివారణపై నిర్లక్ష్యం చేస్తే కటకటలే..

కరోనా నివారణపై నిర్లక్ష్యం చేస్తే కటకటలే..

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నోటా విన్న ఈ పేరు. కరోనా కంటికి కనిపించకుండా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి క్రమంలో ప్రపంచ దేశాలకు పాకింది. ప్రస్తుతం ఇటలీ దేశంలో కరోనా తన వికృత క్రీడను ప్రదర్శిస్తోంది. దీంతో ఇటలీ దేశం శవాల దిబ్బను తలపిస్తోంది. దీంతో యావత్ ప్రపంచం కరోనా మహమ్మరిని అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా భారత్ కొన్ని కఠిన చర్యలు చేపడుతుంది.

భారత్ లో ఆదివారం జనతా కర్ఫ్యూను విధించింది. దేశ ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉంటూ తమ సంఘీభావం తెలిపారు. అయితే సోమవారం నాటికి పరిస్థితి మారిపోయింది. భారత్ కరోనా కేసులు నమోదైన 75జిల్లాలను కేంద్రం లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు నివేదించింది. అలాగే ఈనెల 31వరకు రైళ్లు, విమానాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలెవరూ కరోనా పట్ల నిర్లక్ష్యం వ్యవహరించద్దని సూచిస్తుంది. ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా విషయంలో మోదీ ప్రభుత్వం సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినతరం చేసింది. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు, జైలు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్-తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వం విధించే నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు సోమవారం లాక్ డౌన్ పాటించలేదన్నారు. తెలంగాణలో 1897 చట్టం ప్రకారం లాక్డౌన్ ప్రవేశపెట్టామని, సరిహద్దులు మూసివేసి ఎమర్జెన్సీ విధించామని తెలిపారు. ఐదుగురు వ్యక్తులు మించి రోడ్లపై కనిపిస్తే చర్యలుంటాయని, ఎన్నారైలు క్వారంటైన్ నుంచి వెళ్లకుండా వారి పాస్ పోర్టులు సీజ్ చేస్తామని సీఎస్ సోమేష్ హెచ్చరించారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి మధ్యాహ్నం నుంచి తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉందన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నిత్యవసర వస్తువుల షాపులు కూడా రాత్రి 7గంటలకు మూసివేయాలని హెచ్చరించారు. రోడ్డుపై వచ్చే ప్రతీ వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని మీడియాకు మాత్రం ఎక్కడైనా తిరిగే అనుమతి ఉందన్నారు. చట్టం ఉల్లంఘిస్తే 6నెలల వరకు జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. కావున ప్రజలంతా వారివారి ఇళ్లకే పరిమితమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular