దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. మే 3వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ఏప్రిల్ 20 తర్వాత కొన్నిరంగాలకు సడలింపులు ఉంటాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ రంగానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా ఆర్బీఐ, బ్యాంకులు, ఏటీఎంలు, డెట్ మార్కెట్స్ వంటి వాటిని ప్రస్తావించింది.
ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. అంటే ఎన్పీసీఐ, సీసీఐఎల్, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్, స్టాండలోన్ ప్రైమరీ డీలర్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు యథావిధిగా సేవలను కొనసాగిస్తాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన ఐటీ వెండర్స్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్, ఏటీఎం ఆపరేషన్స్, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు యథావిధిగా కొనసాగుతాయి. డీబీటీ క్యాష్ ట్రాన్స్ఫర్ పంపిణీ పూర్తయ్యే వరకు బ్యాంకు శాఖలు సాధారణ వర్కింగ్ అవర్స్లోనే విధులు నిర్వహిస్తాయి. బ్యాంకుల్లో, బ్యాంక్ కరస్పాండెట్స్ వద్ద ఖాతాదారులు సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యత స్థానిక అడ్మినిస్టేషన్ పేనే ఉంటుంది. సెబీ రూల్స్కు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్లు, డెట్ మార్కెట్లు విధులు నిర్వహిస్తాయి. ఐఆర్డీఏఐ, బీమా రంగ సంస్థలు యథావిథిగా పని చేస్తాయి.