దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే.. ఇవి సాధారణ జనానికి కాదు. పాజిటివ్ వచ్చి కొవిడ్ లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు, హోం ఐసోలేషన్లో ఉన్నవారు ఈ నిబంధనలను పాటించాల్సి ఉంది.
కరోనా లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని, కొవిడ్ పాజిటివ్ రిపోర్టు అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా.. ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు కార్డులూ అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. నిన్న హోం ఐసోలేషన్లో ఉన్నవారికి కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. హోం ఐసోలేషన్లో ఉన్నవారు 10 రోజుల తర్వాత బయటకు రావొచ్చని తెలిపింది. చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే పరీక్ష అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
కాగా.. మరో విషయాన్ని కూడా కేంద్రం వెల్లడించింది. దేశంలోని 180 జిల్లాల్లో గడిచిన వారం రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఇందులోని 54 జిల్లాల్లో గడిచిన మూడు వారాలుగా కొత్త కేసులు వెలుగు చూడలేదని ప్రకటించింది. ఇందులోని 14 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది.