Kolusu Parthasarathy: ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. టిక్కెట్లు దక్కని వారు పక్క చూపులు చూస్తున్నారు. పక్క పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టిడిపిలోకి భారీ వలసలు ఉండడం విశేషం. మరోవైపు జనసేనలో సైతం చేరికలు పెరుగుతున్నాయి. వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో.. చాలామంది సిట్టింగుల సీట్లు గల్లంతవుతున్నాయి. ఈ తరుణంలో వారంతా టిడిపి, జనసేన వైపు చూస్తున్నారు. అయితే అందులో కొందరికి మాత్రమే ఆ రెండు పార్టీలు టికెట్ ఆఫర్ చేస్తున్నాయి. మిగతా వారికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెబుతున్నాయి.
కృష్ణా జిల్లా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారధికి వైసిపి హై కమాండ్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ను ఇన్చార్జిగా నియమించింది. దీంతో పార్థసారథి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇటువంటి పరిణామాలను ముందే ఊహించిన ఆయన టిడిపి టచ్ లోకి వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాదులో టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సారథి.. బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందారు. అటువంటి నాయకుడు పార్టీలో చేరితే ఎంతో ప్రయోజనం అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టిక్కెట్ కేటాయిస్తామన్న ప్రతిపాదనతోనే సారధి టిడిపిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆయనకు నూజివీడు సీటు ఇచ్చేందుకు టిడిపి హై కమాండ్ సమ్మతించగా.. ఆయన ఆసక్తి చూపలేదు.తన సొంత నియోజకవర్గం పెనమలూరు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉన్నారు. ఆయన సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. దీంతో బోడె ప్రసాద్ ను బుజ్జగించేందుకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రంగంలోకి దిగారు. బోడె ప్రసాద్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ ఆయన వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. అయితే బోడె ప్రసాద్ కు ప్రత్యామ్నాయ అవకాశాలను చూసి సర్దుబాటు చేస్తారని సమాచారం. పార్థసారధికి పెనమలూరు డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అతి త్వరలో క్లారిటీ రానుంది.