Minister KTR: తెలంగాణలో రాజకీయం మరీ దారుణంగా తయారవుతోంది. సీఎం కేసీఆర్ ను, మంత్రులను పట్టుకొని ప్రతిపక్షాలు దారుణంగా తిట్టిపోస్తున్నాయి. ఇది వ్యక్తిగత దూషణకు దారితీస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే విరుచుకుపడుతున్నారు.
మంత్రి కేటీఆర్ పై ఇటీవల టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ డ్రగ్స్ ఆరోపణలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాతో కేటీఆర్ కు సంబంధాలు అంటగట్టి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మరీ దారుణంగా మంత్రి కేటీఆర్ అందచందాలు అలా ఉన్నాయంటే డ్రగ్స్ తీసుకోవడమే కారణమని బండి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నాకూ డ్రగ్స్ కి ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధం. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం? ఇక నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడుతాం.. ఎంఐఎంకు ఎవరూ భయపడట్లేదు. బీజేపీనే భయపడుతోంది.’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెయింటింగ్ వేసుకునే వ్యక్తి రేవంత్ రెడ్డికి జూబ్లిహిల్స్ లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి ఇవాళ కన్నమేస్తున్నారు? రూ.50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని ఆ పార్టీ నేతే అన్నారని కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తనకూ డ్రగ్స్ తో అంటగట్టడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విమర్శలకు ఓ హద్దు ఉంటుందని.. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్ ను తిడితే ఊరుకోం అని కేటీఆర్ స్పష్టం చేశారు. షర్మిల, ప్రవీణ్ కుమార్ ఎందుకు కాంగ్రెస్, బీజేపీలపై మాట్లాడారని ప్రశ్నించారు.
మొత్తంగా చాలా రోజుల తర్వాత తనపై ఆరోపణలు చేస్తున్న వారికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక కేసీఆర్ ను తిట్టిపోస్తున్న వారిపై విమర్శలతో విరుచుకుపడ్డారు.