PM Narendra Modi: ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర కే ఇదొక గేమ్ చేంజర్ అవుతుందని ఎక్కువమంది భావిస్తున్నారు. ఆగస్టు 1న అంటే రేపు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని ఇలా ఉత్తరాంధ్రలో అడుగు పెడుతున్న వేళ.. విశాఖకు గొప్ప గుడ్ న్యూస్ వచ్చింది. కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికరణతో పాటు కోచింగ్ యార్డు ఆధునీకరణ, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరచనుంది కేంద్ర రైల్వే శాఖ. అయితే మోడీ ఇలా వస్తున్న వేళ విశాఖకు ఈ భారీ గుడ్ న్యూస్ రావడం విశేషం.
* కీలక ప్రాజెక్టులకు..
విజయనగరం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కేవలం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. పనిలో పనిగా విశాఖకు భారీగా నిధుల వరద ప్రకటించింది కేంద్ర రైల్వే శాఖ. విశాఖ రైల్వే స్టేషన్ లో కోచింగ్ యార్డ్ ఆధునీకరణకు రూ.229 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖ రైల్వే స్టేషన్ రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా రైల్వే లైన్లు, ప్లాట్ ఫామ్లను సైతం నిర్మించనున్నారు.
* విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 113 రైళ్లు, దాదాపు 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కోచింగ్ యార్డ్ కారణంగా అవసరానికి తగిన విధంగా ప్లాట్ఫార్మ్ లు అందుబాటులో ఉండడం లేదు. నిర్వహణపరంగా సమస్యలు తప్పడం లేదు. రైళ్లు వచ్చే సమయంలో క్రాసింగ్కు అవసరమైన స్థలం లేకపోవడంతో సిగ్నల్స్ దగ్గరే రైళ్లను రైళ్లను నిలుపుదల చేస్తున్నారు. ఈ ఇబ్బందిని గమనించిన రైల్వే శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో విశాఖ రైల్వే స్టేషన్ లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* విశాఖలో ఉన్న లూప్ లైన్ లు తొలగించి.. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫాములను విస్తరించనున్నారు. అదనంగా మరో ఆరు ప్లాట్ ఫామ్ లు నిర్మించనున్నారు. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారు. కొత్తగా ఆరు రైల్వే లైన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్లాట్ ఫామ్ లు విస్తరించిన తర్వాత ప్రయాణికుల రాకపోకలు సులభంగా ఉండేందుకు ర్యాంపులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికైతే ప్రధాని ఉత్తరాంధ్రలో అడుగుపెడుతున్న వేళ.. విశాఖకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్టే.