Homeఆంధ్రప్రదేశ్‌పవన్ వైపు కాపులు

పవన్ వైపు కాపులు

Pawan Kalyan
బీజేపీ–జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ ఉంటారని ఆయన పేరుని ఇప్పటికే బీజేపీ ఖరారు చేసింది. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ–జనసేన సంయుక్తంగా అధికారంలోకి వస్తామనే ఆ ఇరు పార్టీల్లోనూ కనిపిస్తోంది. నిజానికి కాపు నేతల ఫోకస్‌ అంతా కూడా పవన్‌ కల్యాణ్‌పై కాకుండా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలపై చిరంజీవికి పెద్దగా ఆసక్తి లేదు. అందుకే.. ఇప్పుడు జనసేన–బీజేపీ కూటమి కలిసి కాపు సామాజిక ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఈ సీఎం కార్డును వాడుతున్నట్లు అర్థమవుతోంది.

బీజేపీ ప్రకటనతో ఆ పార్టీకి కొంత సానుకూల స్పందన అయితే కనిపిస్తోంది. అంతేకాదు..ఈ ప్రకటన బీజేపీ కంటే జనసేనకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతోంది కూడా. వైసీపీ, టీడీపీకి చెందిన కొందరు కాపు నేతలు, ఒక్కసారిగా ఈ ప్రకటనతో షాక్‌కి గురయ్యారట. పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుందా? ఉంటే, వెంటనే అటువైపు వెళ్లిపోవడమే మంచిది.. అని కాపు సామాజిక వర్గ పెద్దలు, కాపు సామాజిక వర్గ నేతలకు సూచిస్తున్నారట. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించి అత్యవసర సమావేశాలు అత్యంత రహస్యంగా జరుగుతున్నాయట.

అయితే… అధికార వైసీపీ మాత్రం ‘అంత సీన్ లేదు’ అని కొట్టి పారేస్తోంది. బీజేపీ, జనసేనను మోసం చేస్తోందని.. ప్రత్యేక హోదా విషయంలో చేసినట్లే పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ వెన్నుపోటు తప్పదని వైసీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతలు అప్పుడే తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. ఏమో గుర్రం ఎగరా వచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. వైసీపీ సంగతి పక్కన పెడితే, టీడీపికి చెందిన కాపు నేతలైతే, ఈ సాకుతో టీడీపీని వదిలి.. బీజేపీ పంచన చేరేందుకు అప్పుడే మంతనాలు కూడా షురూ చేసేశారట.

మొత్తంగా చూస్తే బీజేపీ సీఎం క్యాండిడేట్‌ ప్రకటనతో ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాపు నేతల్లో మాత్రం ఆలోచన మరింత రెట్టింపయింది. ఇప్పటివరకు ఉన్న పార్టీలో ఉండలేక.. అటు పవన్‌ పంచన చేరలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం పార్టీని వదిలి మరో పార్టీలోకి జంప్‌ అయితే ఫ్యూచర్‌‌ ఎలా ఉంటుందా అని సందిగ్ధత వారిలో కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular