
సీఎం జగన్ ఎన్నికల హామీలోనూ భూ సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సమగ్ర భూసర్వేకు పూనుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించారు. కేసీఆర్ బాటలో ఏపీ సీఎం జగన్ పయనిస్తూ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడెప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హాయాంలో ఏపీలో 120 ఏళ్ల క్రితం తయారు చేసిన భూరికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించారు. సమగ్ర భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు.
జనవరి 1, 2021 నుంచి ఏపీలో సమగ్ర భూసర్వే చేపట్టి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యూనల్స్ ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సర్వేయర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని డ్రోన్లు, రోవర్లు,సర్వే రాళ్లు ఉపయోగించి భూ సర్వే చేయాలని అధికారులకు జగన్ సూచించారు. భూ సమగ్ర సర్వేతో రికార్డులు ప్రక్షాళన చేసి భూ యజమానులకు భరోసా కల్పించడంతోపాటు టీడీపీ నేతల బినామీల గుట్టు రట్టు చేసేలా భూముల సర్వేకు జగన్ శ్రీకారం చుట్టినట్టు తెలిసింది.
ప్రధానంగా జగన్ తీసుకున్న ఈ స్టెప్ టీడీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. బినామీలతో అమరావతిలో భూములు కొట్టేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చంద్రబాబు హయాంలో అమరావతి సహా చాలా భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూకుంభకోణం, చుక్కల భూముల వ్యవహారం, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ సహా చాలా భూవివాదాలు వచ్చాయి.
సమగ్ర భూసర్వేలో బినామాలనే అసలు పట్టదారులుగా గుర్తిస్తే వెనుకున్న వారు నిండా మునుగుతారు. బయటపడితే వారి బండారం బయటపడుతుంది. ఇలా టీడీపీ గుట్టురట్టు చేయడానికే జగన్ ఈ భూ సమగ్ర సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది.