ఏపీ మంత్రివర్గ విస్తరణపై వైసీపీ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, త్వరలో అది జరగబోతుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో.. ఎవరిపై వేటు వేస్తారోనన్న చర్చ సైతం సాగుతోంది. అయితే సీఎం జగన్ తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని అందరికీ తెలిసింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన పార్టీలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డిపై వేటు పడనుందా..? జగన్ ఆయనకు అప్పగించిన కొన్ని బాధ్యతలనుంచి తప్పించనున్నారా..?
ఏపీ ప్రభత్వ, పార్టీ విషయంలో విజయసాయిరెడ్డి ప్రత్యేక పాత్ర పోషిస్తారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించడంతో ఆయన పార్టీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ బాధ్యతల నుంచి ఆయనను తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించనున్నట్లు పొలిటికల్ టాక్. ఉత్తరాంధ్రలో ముఖ్య పట్టణమైన విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విశాఖకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని కొందరు నాయకులు విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సమాజిక వర్గానికి చెందిన వారు ఆయనపై కొపంతో రగిలిపోతున్నారు. విజయసాయిరెడ్డి వల్ల తమకు జరిగిన అన్యాయం గురించి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారట. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో విజయసాయిరెడ్డిపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే కొందరు తన పేరు చెప్పి బెదరిస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు.
రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి లగ్జరీ లైఫ్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. అత్యంత ఖరీదైన విమానంలో ప్రయాణించిన విషయాన్ని కొందరు బాహాటంగానే ప్రస్తావించారు. అయితే తనకు సొంత ఇల్లు కూడా లేదని, ప్రస్తుతం హైదరాబాద్లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నానని విజయసాయిరెడ్డి చెప్పొకొస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక అవసరం ఏర్పడితే తప్ప తాడేపల్లి వైపునకు వెళ్లడం లేదని, ఎక్కువగా హైదరాబాద్లోనే గడుపుతున్నారని అంటున్నారు. కానీ ఆయనపై వచ్చిన ఆరోపణలపై వేటు పడే అవకాశం తప్పేట్లు లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
వైసీపీలో జగన్ తరువాత విజయసాయిరెడ్డికి ఇప్పటి వరకు ప్రాధాన్యం ఉండేది. కానీ ఆయనపై వేటు పడితే మాత్రం ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసినా ప్రస్తుతం ఆ పోస్టులో లేరు. అయితే మంత్రి వర్గ విస్తరణలో సజ్జలకు ప్రాధాన్యం ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఒకవేళ సజ్జలకు మంత్రి పదవి లభిస్తే ఇక విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గినట్లేనని అనుకుంటున్నారు.