కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో దెబ్బతిన్న పరిశ్రమలు, రాష్ట్రాలను ఆదుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో వలస కూలీల వాటా ఎంతో వివరించాలని అన్నారు.
ఈ రోజు కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్యాకేజీ ప్రకటనపై చిదంబరం విమర్శలు కురిపించారు. వలస కూలీలకు సంబందించిన సాయం గురించి లేకుండా ప్యాకేజీ ప్రకటించడం ఏమిటని ఆయన మండిపడ్డారు. ఆమె ప్రకటించిన ప్యాకేజీలో వలస కూలీలకు వాటా ఎంత? అని ఆయన అన్నారు. ఆకలితో మలమలలాడుతూ వందల కిలోమీటర్లు నడుస్తున్న పేద వలస కార్మికులను ప్రస్తావించకపోవడం, వారిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు.ఈ ఆర్థిక ప్యాకేజీ పెద్ద ఎంఎస్ఎంఈల కోసమేనని చిదంబరం విమర్శించారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందని అన్నారు. 13 కోట్ల కుటుంబాలు లాక్ డౌన్ కు తీవ్రంగా నష్టపోయాయని, ప్రభుత్వ సాయం వారిని ఈ కష్టాల నుంచి కాపాడలేకపోయిందని చిదంబరం అన్నారు.
ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే ప్రతీ రూపాయి.. పేదల ఆకలిని తీర్చేలా ఉండాలని చిదంబరం అభిప్రాయపడ్డారు. చేతిలో పని లేక వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తోన్న పేదల ప్రయోజనాల కోసం పాటుపడాలని చిదంబరం కోరారు.