
లాక్ డౌన్ కారణంగా అందరికన్నా ఎక్కువగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. వాటికి రుణాలు ఇచ్చేందుకు రూ. 3 లక్షల కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత రాత్రి ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ప్యాకేజి వివరాలను తెలుపుతూ ఎంఎస్ఎంఇ కింద ఇచ్చే రుణాలకు కేంద్రం హామీ ఇస్తుందని తెలిపారు. ఎంఎస్ఎంల నిర్వచనంలో సహితం కీలక మార్పులు తీసుకు వస్తూ వాటికి బ్యాంకుల నుండి సులభంగా రుణాలు లభించేవిధంగా చూస్తున్నట్లు ఆమె చెప్పారు.
అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. 45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా చెప్పారు.
అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.