వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోపనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆలసయం చేయడంపై మండిపడింది. బిల్లుల చెల్లింపు కోసం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై సీరియస్ అయింది. ఆగస్టు 1లోగా బిల్లులు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. ఇందులో విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేశారన్న కారణంతో వైసీపీ సర్కారు ఉపాధి హామీ పనులు చేసిన వారికి బిల్లులు రెండేళ్లుగా చెల్లించకుండా బకాయిలు పెట్టింది. దీంతో అప్పట్లో పనులు చేసిన వారు హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టు ఇవాళ మరోసారి సీరియస్ అయింది.
ఆగస్టు 1 లోగా ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులుకోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వీరిదద్దరు ఓసారి కోర్టుకు హాజరై బిల్లుల చెల్లింపులపై వివరాలు అందించారు అయినా ఇప్పటికీ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఆదేశాలు ఎందుకు అమలు చేయట్లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది. పని చేసిన వారికి వేతనాలు సకాలంలో అందించే విధంగా చట్టంలో ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం వహించడమేమిటని ప్రశ్నించింది.